కృష్ణా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిస్తేజం: బెజవాడ బరిలో ఆదిశేషగిరిరావు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రుష్ణా జిల్లా నేతల్లో తమ భవితవ్యం
అమరావతి/ విజయవాడ: మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ, లోక్సభ జమిలీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ టైం సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమైంది. కానీ దాని ప్రాముఖ్యత ఆ పార్టీ నేతల్లో కనిపించడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కొరవడింది. నిస్తేజం ఆవరించుకున్న పార్టీ నేతలు ప్రజలకు దూరంగా ఉన్నారు. ఆ పార్టీ నాయకుల్లో హుషారు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలు లేవు.
ప్రతిపక్షంగా ఆ పార్టీకి కృష్ణా జిల్లాలో ఆందోళనలు, సంస్థాగత కార్యక్రమాలు చేపట్టడానికి చాలా పని ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ దేనికీ స్పందించటం లేదని జిల్లా ప్రజలు చెప్తున్నారు. జిల్లాకు చెందిన ఒకరిద్దరు నాయకులు మాత్రం అప్పుడప్పుడు మీడియాలో మెరుస్తారే తప్ప మిగిలిన సమయాల్లో ఎక్కడ ఉంటారో ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని చెప్తున్నారు.
Recommended Video


భవిష్యత్పై కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ఆందోళన
కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిస్తేజం ఆవహించింది. జిల్లాలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా స్పందించే నేతలే కరవయ్యారు. జిల్లాలోను, అర్బన్లోను అసలు కమిటీలు ఉన్నాయో? లేదో? తెలియని అయోమయ పరిస్థితి. దీనంతటికీ కారణం పార్టీ నాయకుల్లో ఎవరికి టిక్కెట్ లభిస్తుందో, లేదోనని భరోసా లభించకపోవడమేనని ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ఇందులో ఒకటి, రెండు అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలిన నియోజక వర్గాల్లో ఎక్కడా నాకే సీటు అని ఎవరూ స్పష్టంగా చెప్పుకోలేని పరిస్థితిలో నాయకులు ఉన్నారు. జిల్లాలో ఆ పార్టీకి ఉన్న గట్టి నాయకులలో కూడా తమ సీటుపై కాని, భవిష్యత్పై కాని నమ్మకం కనిపించడం లేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకుల్లో ఒకరిద్దరు తప్ప ఎవరూ చురుగ్గా కనిపించటం లేదు.

బందరుకు మాజీ మంత్రి పార్ధసారథి
విజయవాడ లోక్ సభ స్థానం నుంచి సినీ నటుడు కృష్ణ అన్న ఆదిశేషగిరి రావు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధిష్ఠానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలుసు పార్ధ సారథిని మచిలీపట్నం పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయించి యడ్లపాటి వెంకట్రావుని పెనమలూరు నుంచి అసెంబ్లీ బరిలోకి దింపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక గత ఎన్నికలలో టీడీపీ సీటు కోసం విశ్వ ప్రయత్నం చేసిన పొట్లూరి వరప్రసాద్, ఈ సారి విజయవాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయటానికి ఆసక్తితో ఉన్నట్టు సమాచారం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం విజయవాడ నుంచి ప్రముఖ సినీ నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావును పోటీ చేయించే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆదిశేషగిరిరావు, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. జగన్ పాదయాత్ర విజయవాడ చేరుకున్న సమయంలో ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరతారని అంటున్నారు.

పామర్రు అభ్యర్థి ఎవరు?
గత ఎన్నికల్లో మైలవరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ వచ్చే ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే పోటీ చేయాలని ఉత్సాహంగా ఉన్నారు. మైలవరం సీటు వసంత కృష్ణప్రసాద్కు ఇస్తారనే ప్రచారం ఇటీవల పెరిగింది. కృష్ణప్రసాద్ ప్రస్తుతం తటస్ధంగా ఉన్నారు. పామర్రు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఉప్పులేటి కల్పన కూడా ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో కూడా స్పష్టత లేదు. పెడన, కైకలూరు, నందిగామ, తిరువూరు, గన్నవరం నియోజకవర్గాల సీట్ల విషయంలో కూడా పార్టీలో స్పష్టత లేక అక్కడ కూడా నాయకత్వం ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. గత రెండేళ్లలో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేపట్టిన గట్టి కార్యక్రమాలు ఒక్కటి కూడా లేదని చెప్పవచ్చు. ఎన్నికలు ముంచుకువస్తున్నప్పుడు కూడా పార్టీని నిస్తేజం వదలకపోవడం నాయకులను ఆందోళన పరుస్తోంది.

విజయవాడ తూర్పు నుంచి ముగ్గురు పోటీ
విజయవాడ తూర్పు స్థానం నుంచి పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణకు కృష్ణా జిల్లా అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయనకు స్వేచ్చ లేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. రాధాకృష్ణకు సెంట్రల్ నియోజకవర్గంపై ఆసక్తి ఎక్కువ. ఈ సారి ఆయనకు విజయవాడ తూర్పు సీటు ఇస్తారా? లేక సెంట్రల్ ఇస్తారా? అన్నదానిపై పార్టీలో స్పష్టత లేదు. సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా చేసిన మల్లాది విష్ణు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన విజయవాడ సెంట్రల్లో తప్ప మరెక్కడి నుంచి పోటీ చేయరు. వీరిద్దరిలో ఎవరి పరిస్థితి ఏమిటో ఎన్నికల నాటికిగాని తెలియదేమో. రాధా, విష్ణు పరిస్థితి ఇలా ఉంటే తూర్పు ఇన్చార్జ్గా ఉన్న బొప్పన భవకుమార్ కూడా ఆ సీటుపై ఆశతో ఉన్నారు. చివరికి ఆయన పరిస్థితి ఏమవుతుందో తెలియదు. విష్ణుకు కూడా అసెంబ్లీ సీటు ఇచ్చే పక్షంలో వంగవీటి రాధాకృష్ణను మరోసారి ‘తూర్పు'కు వెళ్లమనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడ తూర్పు సీటుపై కాస్తో కూస్తో ఆశతో ఉన్న భవకుమార్ ఆ నియోజకవర్గంలో డబ్బులు ఖర్చుపెట్టుకుంటూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

విజయవాడ వెస్ట్లో కుదుట పడని దుస్థితి
పశ్చిమ నియోజకవర్గానికి వస్తే గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్ఖాన్ టీడీపీలో చేరడంతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి ఇంకా కుదుటపడలేదు. బీజేపీ నాయకుడు, పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఆ పార్టీకి గుడ్బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆయనకు పార్టీలో చేరిన సమయంలోనే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. పశ్చిమలో ముస్లిం వర్గాలకు సీటు ఇవ్వాలనే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. జలీల్ఖాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత ఆ స్థాయిలో ఉండే ప్రత్యామ్నాయ నాయకుడిని తయారు చేయలేదు. దీంతో పశ్చిమంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది.

పెనమలూరుకు యడ్లపాటి?
పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో పెద్దగా తెలియని యడ్లపాటి వెంకట్రావు పేరిట అనేక ఫ్లెక్సీలు వెలిశాయి. వ్యాపార రంగంలో ఉన్న యడ్లపాటి, పెనమలూరు సీటు కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎంత ఖర్చుకైనా ఆయన సిద్ధమని అంటున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రజలకు, కార్యకర్తలకు అంతగా పరిచయం లేకపోయినా బాగా ‘సౌండ్' పార్టీగా ముద్రపడిన యడ్లపాటి వెంకట్రావుకు ఎక్కడో ఒక చోట సీటు ఖాయమనే మాట వినిపిస్తోంది. పెనమలూరు స్థానం నుంచి మాజీ మంత్రి పొలుసు పార్ధసారథి బరిలోకి దిగాలనే ఉత్సాహంతో ఉన్నట్టు చెబుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications