తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో నివురుగప్పిన నిప్పులా అసమ్మతి
Recommended Video
తూర్పుగోదావరి జిల్లా: తూర్పు గోదావరి జిల్లాలో ప్రధానంగా రెండు చోట్ల వైసిపి కీలక నేతల మధ్య విబేధాల కారణంగా అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉండి ఏ క్షణంలోనైనా బద్దలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఒకే ఫ్యామిలీలో 11మంది అనుమానాస్పద మృతి: హత్యలేనా?, డైరీలో ఏముంది? 'ఆ11 పైపులేంటీ?'
రామచంద్రపురం అసెంబ్లీ నుంచి తన కుమారుడిని పోటీ చేయించాలని ఆశపడిన వైసిపి సీనియర్ నేత , ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్కు ఆ విషయంలో ఆశాభంగం జరగడం ఈ అసమ్మతికి ఒక కారణం కాగా...మరోవైపు ఏపీఐసీసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం వైసిపి లోకి రానున్నట్లు ప్రకటించడం మరో గ్రూప్ రాజకీయానికి తెరతీసింది.
వైసిపిలో....అసమ్మతి రాగాలు...
ఇటీవలే వైసీపీ తమకు సామాజికవర్గాలకు అన్యాయం చేస్తోందంటూ కులసంఘం సమావేశంలో ధ్వజమెత్తిన వైసిపి సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్, చిట్టబ్బాయ్ వర్గాలు ఆ తరువాత సైలెంటయి పోయారు. తమ సామాజిక వర్గాలకు ఉన్న ప్రాధాన్యత రీత్యా టిడిపి నుంచి పిలుపు వస్తుందని ఆశించినా ఇప్పటికే ఓవర్ క్రౌడ్ పరిస్థితి ఎదుర్కొంటున్న టిడిపి ఏమాత్రం వీరి విషయంలో అంతగా స్పందించలేదని తెలిసింది. దీంతో ఆ తరువాత వీరు వైసిపి పై పెద్దగా విమర్శలు చేయకపోవడం గమనార్హం.
ఈ క్రమంలో...మరో దెబ్బ
పోనీ తన కుమారుడికైనా రామచంద్రపురం అసెంబ్లీ నుంచి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆశపడగా...అక్కడ పోటీకి బోస్ కుటుంబం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సరితూగడం కష్టమని వైసీపీ అధినేత జగన్ భావించి ఉండొచ్చని... అందుకే ఆ స్థానంలో జెడ్పీ మాజీ చైర్మన్ వేణుగోపాలకృష్ణను బరిలోకి దింపాలని వైసిపి అధినేత నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ముమ్మిడివరం అసెంబ్లీ సీటు శెట్టిబలిజలకు ఇవ్వాలని బోస్ గట్టిగా కోరగా...అది కూడా సాధ్యం కాదని...అక్కడ మత్స్యకార సామాజికవర్గానికి చెందిన పొన్నాడ సతీష్ని అభ్యర్థిగా జగన్ దాదాపుగా ఖరారు చేసేశారని అంటున్నారు. ఈ రెండు పరిణామాలతో మరింత మనస్థాపానికి గురైన బోస్ లోలోపల అసమ్మతితో రగిలిపోతున్నారని, అయినా చేసేది లేక మిన్నకున్నారని అంటున్నారు.
ఒకప్పుడు...రాజమండ్రిలో
ప్రస్తుతం రాజమహేంద్రవరంలో వైసీపీ అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు...అందులోనూ జక్కంపూడి వర్గీయులే ప్రధానంగా కనిపిస్తారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు బతికి ఉన్న రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ అంటే జక్కంపూడి, మాజీ ఎంపీ అరుణకుమార్ వర్గంగానే ఉండేది. వీరిద్దరు ఒకే వర్గంగా ఉంటూ వైఎస్ రాజశేఖరరెడ్డికి అనుచరులుగా ఉండేవారు. అలాగే జక్కంపూడికి సన్నిహితంగా ఉండే మాజీ ఎమ్మెల్యే సిటీ వైసీపీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాష్రావు ప్రత్యేక వర్గంగా ఎదిగారు. ఇటీవల జక్కంపూడి కుటుంబ సభ్యులకు, రౌతుకి మధ్య కూడా పెద్ద సంబంధాలు లేనట్టు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం వైసిపిలో బేషరతుగా చేరనున్నట్లు ప్రకటించారు.
అడ్డుకునేందుకు...ఆగ్రహ జ్వాలలు
అయితే శివరామసుబ్రహ్మణ్యం వైసిపిలోకి రాకుండా అడ్డుకునేందుకు రౌతు సూర్యప్రకాష్రావు వర్గం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్వయంగా శివరామసుబ్రహ్మణ్యం ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. తాను తన ఆఫీసులో మిత్రులతో కలసి సరదాగా చేసిన సంభాషణను రికార్డు చేసి వైసీపీ అధిష్టానం దగ్గర చూపించి తనను బ్యాడ్ చేస్తున్నారని శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్యణ్యం ప్రత్యర్థులపై ఆరోపణాస్త్రం సంధించారు. చెరుకూరి కల్యాణ మండపంలో ఆత్మీయ మిత్రుల సమ్మేళనంతో భారీ అనుచరగణంతో బలప్రదర్శన చేసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ 24 గంటల్లో 10 వేల మంది సభ్యత్వంతో తాను పార్టీలో చేరగలనని, తనను తీసుకుంటే వైసీపీకి అదృష్టమని, లేకుంటే దురదృష్టమని అన్నారు. అలాగే నా గురించి కొందరు మాట్లాడుతున్నారని...నేను నోరు విప్పితే ఇక్కడ నాయకుల గురించి చెప్పడానికి మైదానం కూడా సరిపోదని 10ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఓవ్యక్తి అవినీతికి సంబంధించిన ఆధారాలు నావద్ద ఉన్నాయని ఆయన పరోక్షంగా రౌతు మీద ధ్వజమెత్తారు. దీంతో తూర్పు గోదావరిలో ఏ క్షణంలోనైనా అసమ్మతి జ్వాలలు జ్వలించవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.