రీపోలింగ్కు సర్వం సిద్ధం: వేడెక్కిన చంద్రగిరి: భారీగా బలగాలు
చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రీపోలింగ్ నిర్వహించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. ధర్నాలకు దిగుతున్నారు. బైఠాయింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవంక- వారి ఆందోళనలను కొనసాగుతుండగా మరోవంక.. రీపోలింగ్కు అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది జిల్లా పాలనా యంత్రాంగం. ఎన్నికల సిబ్బంది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఇతర సామాగ్రిని సిద్ధం చేసింది. శనివారం సాయంత్రానికి వాటిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారని తెలుస్తోంది.
చంద్రగిరి నియోజకగర్గం పరిధిలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామాపురంలల్లో పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఈ అయిదు పోలింగ్ బూత్ల పరిధిలో మొత్తం 3,899 మంది ఓటర్లు ఉన్నారు. తుది దశ పోలింగ్ సందర్భంగా ఈ అయిదు బూత్లల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించబోతున్నారు. రీపోలింగ్ ఉన్న విషయాన్ని దండోరా వేసి మరీ చాటుతున్నారు అధికారులు. రీ-పోలింగ్ జరిగే కేంద్రాల పరిధిలో శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉంటుంది.
19 వరకు నో షో: రీపోలింగ్ ఎఫెక్టేనా?
పోలింగ్ రోజున 144 సెక్షన్ను విధిస్తారు. వైన్షాపులు బంద్ మూసివేస్తారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ శుక్రవారం ఉదయం చేపట్టారు. పోలింగ్కు అవసరమైన ఈవీఎంలు సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు 20 చొప్పున ఈవీఎంలను వినియోగిస్తామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. తిరుపతి రూరల్ ఎస్పీ, డీఎస్పీ నేతృత్వంలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా కల్పించబోతున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చడంతో పాటు ఓటింగ్ ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రీ-పోలింగ్కు సంబంధించిన సామగ్రిని జిల్లా ఎన్నికల విభాగం కేంద్రాలకు పంపడానికి ఏర్పాట్లు చేపట్టారు. కలెక్టర్ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ గిరీష పరిశీలించారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ హాలులో ఈ ఎన్నికల సామాగ్రిని అందుబాటులో ఉంచారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగడానికి అవసరమైన దాని కంటే అదనంగానే సామగ్రిని పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తి పల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామాపురంలల్లో బూత్లల్లో కిందటి నెల 11వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డారని, ఓటు హక్కును వినియోగించనీయకుండా దళితులను అడ్డుకున్నారని అంటూ వైఎస్ఆర్సీపీకి చెందిన చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సాక్ష్యాధారాలను ఆయన అందజేశారు. వాటిని పరిశీలించిన అనంతరం- అక్రమాలు చోటు చేసుకున్నట్లు నిర్ధారించారు. రీపోలింగ్కు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళనలను చేపట్టిన విషయం తెలిసిందే.