తప్పంతా చింతమనేనిదే: ఎమ్మార్వో వనజాక్షి 'గీత' దాటలేదు.. రిపోర్టులో ఇలా!
తన పరిధి కాకపోయిన తమను అడ్డుకున్నారన్న ఎమ్మెల్యే వాదన తప్పని తాజా రిపోర్టు స్పష్టం చేసినట్లు సమాచారం.
అమరావతి: ఎమ్మార్వో వనజాక్షి-ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ల మధ్య గొడవ విషయం అంత తేలిగ్గా మరిచిపోయేదేమి కాదు. ప్రభుత్వ అధికారిపై ఎమ్మెల్యే అనుచరులు విరుచుకుపడిన తీరుపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎమ్మార్వోపై దాడికి పాల్పడింది అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో.. వివాదం పెద్దది కాకుండా చూడటానికి ప్రభుత్వమే చొరవచూపింది.
ఎమ్మార్వో వనజాక్షిని చల్లబరిచి చింతమనేనితో రాజీకి వచ్చేలా రాయబారం నెరిపింది. ప్రభుత్వ ఉద్యోగులకే రక్షణ లేకుండా పోతుందన్న విమర్శలు ఎక్కువవడంతో.. దీనిపై ఓ ద్విసభ్య కమిటీని కూడా వేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి జగదీష్ చంద్ర శర్మ. ఐఏఎస్ అధికారి సాల్మన్ అరోఖ్యరాజ్లను ఇందులో సభ్యులుగా నియమించింది. తాజాగా ద్విసభ్య కమిటీ రిపోర్టు ప్రభుత్వం వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంలో వనజాక్షి తప్పేమి లేదని రిపోర్టులో వెల్లడించినట్లు తెలుస్తోంది.

తన పరిధి కాకపోయిన తమను అడ్డుకున్నారన్న ఎమ్మెల్యే వాదన తప్పని తాజా రిపోర్టు స్పష్టం చేసినట్లు సమాచారం. ఎమ్మార్వో వనజాక్షి ఇసుక తనిఖీలకు వెళ్లిన ముసునూరు మండలంలోని తమ్మిలేరు ప్రాంతం ఆమె పరిధిలోకే వస్తుందని అధికారులు తేల్చారు. అనుచరులతో కలిసి వనజాక్షిపై దాడి చేయించడంలో ఎమ్మెల్యేదే తప్పు అని నిర్దారించినట్లు చెబుతున్నారు.
అయితే దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకుండా ఎమ్మార్వో వనజాక్షి సొంతంగా వ్యవహరించడం కూడా తప్పేనని కమిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంలో చింతమనేనిదే ఎక్కువ భాగం తప్పు అని స్పష్టమవుతుండటంతో.. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications