టీపీసీసీ చీఫ్ పదవి అడిగా కానీ: అరుణ, లేను: జానా
న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని మార్చే పక్షంలో మహిళా నేతగా తనకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ను బుధవారం కోరారు. పార్టీ ఎంపీ నంది ఎల్లయ్యతో కలిసి ఆమె బుధవారం డిగ్గీతో భేటీ అయ్యారు.
అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సి వస్తే తనకు అవకాశం ఇవ్వాలని కోరానని, అధ్యక్షుడిని మార్చమని మాత్రం కోరలేదని చెప్పారు. ఇప్పటికిప్పుడు సారథిని మారుస్తారని తాను భావించడం లేదన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి పొన్నాల లక్ష్మయ్య ఒక్కరినే బాధ్యులు చేయడం సరికాదన్నారు. ఓటమికి తామందరిదీ బాధ్యత అన్నారు.
రేసులో లేను: జానా రెడ్డి
తాను పీసీసీ రేసులో లేనని తెలంగాణ కాంగ్రెసు పార్టీ శాసన సభాపక్ష నేత జానా రెడ్డి చెప్పారు. పీసీసీ చీఫ్ మార్పు అంశంపై మాట్లాడుతూ.. దీనిపై వస్తున్న ఊహాగానాలకు పొన్నాల చేసిన వ్యాఖ్యలే కారణమన్నారు. వాటికి ఆయననే తెరదించాలన్నారు. తాను వదంతులకు దూరమని, మీడియా అడిగిన ప్రశ్నలకు నాయకులు సరైన సమాధానాలు ఇవ్వక పోవడం వల్లనే ఈ ఊహాగానాలు వస్తున్నాయన్నారు.
అధ్యక్షుడిని మార్చాలా వద్దా అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని, ఆ సమయం వస్తే సీనియర్ నేతలుగా తమ సూచనలను తప్పకుండా ఇస్తామన్నారు. రేసులో ఎవరు ఉన్నా అందర్నీ సమన్వయం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. గతంలో కంటే ఇప్పుడే నేతల మధ్య సమన్వయం పెరిగిందన్నారు.