ఈ ఎన్నికల్లో వైసీపీకి కొత్త సంకేతాలు- పుంజుకున్న టీడీపీ : మంత్రుల ఇలాకాల్లో షాకింగ్..!!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పర్వం ముగిసింది. 2019 ఎన్నికల నుంచి అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తూ వచ్చింది. కానీ, చివరి విడత జరిగిన పెండింగ్ మున్సిపల్ .. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చివరి విడత ఎన్నికల్లో వైసీపీకే మెజార్టీ సీట్లు దక్కినా.. టీడీపీ సైతం పుంజుకుంది. మున్సిపల్..అదే విధంగా పరిషత్ ఎన్నికల ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
వైసీపీ అప్రమత్తం కావాల్సిందేనా
తిరుగులేదు..తమది అంతా ఏకపక్ష విజయాలే అని భావిస్తున్న వైసీపీ నేతలకు అప్రమత్తం కావాల్సిన సంకేతాలను క్లియర్ గా ఇచ్చాయి. టీడీపీ సైతం కొంత మెరుగుపడ్డామనే అభిప్రాయంతో కనిపిస్తోంది. పరిషత్ ఫలితాల్లో అధికార పక్షం ఆధిక్యం కొనసాగింది. 9 జిల్లాల్లో 12 జడ్పీటీసీలు, 13 జిల్లాల్లో 132 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 9 జడ్పీటీసీలు, 88 ఎంపీటీసీల్లో విజయం సాధించింది. టీడీపీ మూడు జట్పీటీసీలను, 33 ఎంపీటీసీలను గెలుచుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది.
మంత్రుల ఇలాకాల్లో మారుతున్న సమీకరణాలు
పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, హోం మంత్రి సుచరితలకుకొంత షాకిచ్చింది. విజయనగరం జిల్లాలో తొమ్మిది ఎంపీటీసీలకు ఎన్నికలు జరగ్గా.. 6 వైసీపీ, 2 టీడీపీ, ఒక స్థానాన్ని బీజేపీ గెలుచుకున్నాయి. బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్ల మండలం నాగళ్లవలస ఎంపీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది. ఇదే జిల్లా రామభద్రాపురం మండలం బూసాయివలసలో టీడీపీ అభ్యర్థి మడక స్వర్ణలత 623 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సాలూరు నియోజవర్గం మక్కువ మండలం ఎ.వెంకంపేట ఎంపీటీసీని బీజేపీ అభ్యర్థి దొడ్డి సాయిబాబు గెలుచుకున్నారు.
టీడీపీ పుంజుకుంటోందంటున్న ఫలితాలు
హోం మంత్రి సుచరిత సొంత మండలం ఫిరంగిపురంలో టీడీపీ పాగా వేసింది. అమరావతి రాజధాని పరిధిలోని తాడికొండ నియోజకవర్గంలోని గుండాలపాడు, వేమవరం ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సొంత మండలమైన శావల్యాపురం జడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి కూడా గట్టి షాక్ తగిలింది. హిరమండలం జడ్పీటీసీకి పోటీచేసిన ఆమె తనయుడు రెడ్డి శ్రావణ్ ఓటమి పాలయ్యారు. తూర్పుగోదావరిలో 21 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగగా.. వైసీపీ ఎనిమిది చోట్ల గెలిచింది.
Recommended Video
2019 నుంచి వైసీపీ హవా.. ఇప్పుడు మాత్రం
టీడీపీ ఆరు చోట్ల గెలిచింది. ఎటపాక మండలంలో 11 ఎంపీటీసీ స్థానాల్లో ఐదింటిని వైసీపీ, టీడీపీ 4, సీపీఎం, సీపీఐ చెరో స్థానం దక్కించుకున్నాయి. మలికిపురం మండలంలో రెండు ఎంపీటీసీలను జనసేన గెలుచుకుంది. కడియం మండలం కడియపులంక స్థానాన్ని టీడీపీ మద్దతుతో తన ఖాతాలో వేసుకుంది. ఏజెన్సీలోని వీఆర్పురం మండలంలో ఒక ఎంపీటీసీ స్థానాన్ని సీపీఎం చేజిక్కించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ జడ్పీటీసీ, 14 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో జడ్పీటీసీ స్థానాన్ని, 10 ఎంపీటీసీ సీట్లలో వైసీపీ విజయం సాధించింది. రాయలసీమలో వైసీపీ ఘనవిజయాలు సాధించింది. కడప జిల్లాలో లింగాల, జమ్మలమడుగు జడ్పీటీసీ స్థానాలతో పాటు 6 ఎంపీటీసీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీచేయలేదు.