దీక్షతో నీరసించారు: జగన్ ఐదు, చంద్రబాబు మూడోరోజు
హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని, సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. బుధవారం జగన్ దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ఆయనను పరీక్షించారు.
వైయస్ జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని డాక్టర్లు చెప్పారు. షుగర్ లెవల్స్ క్రమంగా తగ్గుతున్నాయని, 58 శాతానికి పడిపోయాయని, బిపి 130/80, పల్స్ రేటు 70గా ఉందని తెలిపారు. జగన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. ఆయనకు వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే వైద్యుల సూచనను జగన్ తిరస్కరించారు.
నీరసించిన బాబు
మరోవైపు ఢిల్లీలోని ఎపి భవన్లో దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం నీరసంగా కనిపించారు. బాబు దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. పడుకుని విశ్రాంతి తీసుకోవడానికే టిడిపి అధినేత ప్రాధాన్యమిస్తున్నారు.
జగన్ను చూడడానికి పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హైదరాబాదులోని దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. మరోవైపు ఢిల్లీలో దీక్ష చేస్తున్న బాబుకు రాష్ట్రం నుండి వెళ్లిన వారే కాకుండా ఢిల్లీ, ఆ చుట్టుపక్కల ఉండే తెలుగువారు మద్దతు తెలుపుతున్నారు.