ఏపీలో సోషల్ అరెస్టులకు ఆ BNSసెక్షన్ వర్తించదా ?
ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కొరడా ఝళిపిస్తోంది. కేంద్రం కొత్తగా తెచ్చిన బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 111 ప్రకారం వీరిపై కేసులు నమోదు చేస్తోంది. ఇదే సెక్షన్ తో వీరిని అరెస్టులు చేస్తోంది. అయితే వ్యవస్థీకృత నేరాలకు ఉద్దేశించి ఈ సెక్షన్ సోషల్ మీడియా ఉల్లంఘనలకు వర్తిస్తుందా లేదా అన్న దానిపై చర్చ జరుగుతోంది. దీనిపై వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఇవాళ వివరణ ఇచ్చారు.
రాష్ట్రంలో చట్టాల్ని దుర్వినియోగం చేస్తూ వైసీపీ కార్యకర్తలను ప్రభుత్వం వేధిస్తోందని ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ఆరోపించారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ లపై పోలీసులు బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారని, అయితే వారిని భయభ్రాంతులకు గురిచేయాలనే కుట్రతోనే ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై మాత్రమే బీఎన్ఎస్ 111 సెక్షన్ ప్రయోగించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చెబుతున్నాయని తెలిపారు.

సాధారణంగా బీఎన్ఎస్ 111 సెక్షన్ ను మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ సరఫరా, కిడ్నాప్, దొంగతనాలు, దోపిడీలు, బలవంతంగా ఆస్తుల స్వాధీనం, సుపారీ హత్యలు, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా దించడం వంటి నేరాలకు పాల్పడే వారిపై ప్రయోగిస్తారని మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ చట్టం రావడానికి కనీసం పదేళ్ల ముందు నుంచి నేరాలకు పాల్పడి ఉండి, కనీసం ఒకటి కన్నా ఎక్కువ కేసుల్లో కోర్టుల్లో విచారణ ఎదుర్కొన్న నిందితులపైనే ఈ సెక్షన్ వాడాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు.
సోషల్ మీడియా కేసులకు బీఎన్ఎస్ 111 సెక్షన్ వర్తించదని కేరళ హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పిందని మనోహర్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఏపీ హైకోర్టులో జస్టిస్ రఘునందన్రావు, జస్టిస్ ఉమామహేశ్వరరావులతో కూడిన సైతం డివిజన్ బెంచ్ సైతం పప్పుల వెంకటరమణారెడ్డిపై బనాయించిన బీఎన్ఎస్ 111 సెక్షన్ చెల్లదని తమ తీర్పులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కేసులో డివిజన్ బెంచ్ తప్పును ఎత్తిచూపడంతో పాటు మెజిస్ట్రేట్ కూడా యాంత్రికంగా పనిచేశారని చెప్పారన్నారు. ఈ సెక్షన్లు పెట్టిన అన్ని కేసుల్లోనూ క్వాష్ పిటిషన్లు వేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications