'మోడీ ముందు మోకరిల్లిన జగన్, బీజేపీలో పదవి రాలేదని వైసీపీ నేతగా సోము వీర్రాజు'
అమరావతి: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చాలా రోజులుగా ఆ పార్టీ అధ్యక్ష పదవి వస్తుందని భావిస్తున్నారని, అది రాకపోవడంతో ఇప్పుడు అక్కసుతో టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. బీజేపీ అధ్యక్ష పదవి రాలేదని తమపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. సోము వీర్రాజు మిత్రధర్మాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేతలు దుయ్యబట్టారు.
ముందు దీనికి జవాబు చెప్పు: టీడీపికి వీర్రాజు దిమ్మతిరిగే ప్రశ్న, పవన్ కళ్యాణ్ కలిస్తేనే..
మోకరిల్లిన జగన్, అదే నిదర్శనం
స్వతంత్ర అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు వచ్చిన సోము వీర్రాజును తాము ఎమ్మెల్సీగా చేశామని, కానీ ఆయన వైసీపీ నాయకుడి వలె మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. జగన్ పార్టీ పూర్తిగా కేంద్రం ముందు మోకరిల్లిందని, బడ్జెట్ బాగుందని కేంద్రాన్ని ప్రశంసించడమే అందుకు నిదర్శనం అన్నారు.
కేటాయింపుల్లేవు, శాఖాపరంగా సాధించుకోవాలి
ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు లేవని చంద్రబాబు అన్నారు. అయినప్పటికీ మన సామర్థ్యం ద్వారా శాఖాపర కేటాయింపుల్లో ఎక్కువ సాధించుకోవాలని అధికారులకు దిశానిర్దేశనం చేశారు. ఆయన నీరు - ప్రగతి, వ్యవసాయంపై జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మరో రూ.10వేల కోట్లు కలిపి
నరేగాకు రూ.55వేల కోట్లు బడ్జెట్ పెట్టినందున సప్లిమెంట్గా మరో రూ.10వేల కోట్లు కలిపి 65 వేల కోట్ల బడ్జెట్ అందుబాటులో ఉంటుందని, అందులో రూ.7వేల కోట్లు మన రాష్ట్రం వినియోగించుకోగలగాలని చంద్రబాబు సూచించారు. నరేగా పనిదినాల సంఖ్య 23 కోట్లకు చేరాలని, ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, మెటీరియల్ కాంపొనెంట్ 40శాతం మించకుండా చూడాలన్నారు.
కొరత రాకుండా చూడాలి
లేబర్ కాంపోనెంట్ పెంచుకోవాలని, మత్స్యశాఖను కూడా నరేగాకు అనుసంధానం చేసినందున దాన్ని మన రాష్ట్రం సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. పంటకుంటలతో పాటు చేపల కుంటలకు నరేగా వినియోగించుకుని రైతుల ఆదాయాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూడున్నరేళ్లలో అనేక పనులు చేపట్టామని, ఈ ఏడాది పనుల్లో స్థిరీకరణ రావాలన్నారు. రాబోయే ఖరీఫ్లో ఏ పంటలు సాగుచేయాలో ఇప్పట్నుంచే దృష్టి పెట్టాలన్నారు. మేలు రకాలు సాగుచేయాలని, ఉత్పాదకత పెరగాలన్నారు. సాగు వ్యయం తగ్గేలా చూడాలని, అన్ని జిల్లాలు పశుగ్రాసం సాగుపై దృష్టి పెట్టాలన్నారు. వేసవిలో పశుగ్రాసం కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.