చంద్రబాబుని అనొద్దు: కమలానంద, జగన్-చిరులని ఏకేసిన పత్తిపాటి
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దుర్ఘటనను ప్రభుత్వ వైఫల్యంగా చూపి రాజకీయ కోణంలో విమర్శలు చేయడం సరికాదని హిందూ ధర్మ ప్రచారకులు కమలానంద భారతి బుధవారం అన్నారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం ఏమాత్రం సరికాదన్నారు.
రాజమండ్రి ఘటన పైన కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలానంద భారతి స్పందించారు.
చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ప్రతిపక్షం, ఇతర ప్రజా సంఘాలను ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో పుష్కరాలకు నీరు తక్కువగా ఉందని, అందుకోసం మహారాష్ట్ర నుంచి నీరు విడుదల చేపించేందుకు సీఎం కెసిఆర్ కృషి చేయాలన్నారు.
జగన్ శవ రాజకీయాలు: పత్తిపాటి
జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనను ఆధారంగా చేసుకొని ఇలాంటివి చేయడం సరికాదన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
అపశృతి దొర్లినప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండాల్సింది పోయి ఇలా మాట్లాడటం విడ్డూరమన్నారు. వీలైతే భక్తులను ఓదార్చాలన్నారు. చిరంజీవి, రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి నేతలు కూడా శవరాజకీయాలు చేస్తున్నారని, చంద్రబాబు ప్రణాళికాబద్ధంగానే ఉన్నారన్నారు.