ముఖ్యమంత్రులకు జెండా ఎగరవేసే హక్కు లేదా?
ఆగస్టు 15వ తేదీ అంటే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. నరాలు నిక్కబొడుచుకుంటాయి. మువ్వన్నెల జెండాకు సలాం కొడతాం. ఈరోజున మనం పీల్చుకునే స్వేచ్ఛావాయువులకు కారణమైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. మన ఇంట్లో, కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, పార్టీ కార్యాలయాల్లో, దేశం మొత్తానికి వర్తించేలా ఢిల్లీలోని ఎర్రకోటపై జెండా ఎగరవేసి మహనీయుల త్యాగఫలాలను స్మరించుకుంటాం.
పంద్రాగస్టు రోజు కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం మనకున్న ఆనవాయితీ. అంటే ప్రజలతో ఎన్నికైన ప్రతినిధి జెండా ఎగరవేయడం ఇందలోని ప్రధాన ప్రాధాన్యత. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1973లో ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రాల్లో గవర్నర్లు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేవారు. 1969లో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Recommended Video
సహకార సమాఖ్యలో రాష్ట్రాలకు మరిన్ని అధికారాల కోసం ఆయన డిమాండ్ చేసేవారు. అలాగే జెండా ఎగరవేసే అంశానికి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివక్ష తగదంటూ అప్పట్లో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఘాటుగా లేఖ రాశారు. రాష్ట్రాల్లో కూడా ఆగస్టు 15వ తేదీనాడు ముఖ్యమంత్రులు పతాకావిష్కరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దీనికి అంగీకరించారు. దీంతో 1974 ఆగస్టు 15వ తేదీ నుంచి ముఖ్యమంత్రులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ప్రారంభించారు. అలా పంద్రాగస్టు రోజున ముఖ్యమంత్రులు, గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్లు జెండా ఎగరవేసే సంప్రదాయం అమల్లోకి వచ్చింది.