టేకిట్ ఈజీ కాదు! అది coronavirus: జగన్ సర్కారుకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ను తేలికగా తీసుకోవద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుకు సూచించారు. కరోనా వైరస్ విజృంభించి ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

అది ప్రపంచ మహమ్మారి..
కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వం విభాగాలు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి స్క్రీనింగ్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డులు, ల్యాబులు పెంచాలని పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ సర్కారుకు సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారి (పెండమిక్)గా ప్రకటించిన తరువాత కూడా తేలిగ్గా తీసుకోవడం సరికాదన్నారు.

వస్తుంది.. పోతుంది.. కాదు..
మన రాష్ట్రంలో లేదు... వైరస్ వస్తుంది, పోతుంది అనుకొనే తరుణం కాదిది. వైరస్ విస్తృతి మొదటి రెండు వారాల తరవాతే ఉంటుంది అని ఇతర దేశాల అనుభవాల ద్వారా వెల్లడవుతోంది. రాజకీయ అవసరాల కోసం కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పంతాలు, పట్టింపులకు పోకూడదు. వాటిని వదిలి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఈ ముందు జాగ్రత్తలు తీసుకోండి..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తు.చ. తప్పకుండా అమలు చేయాలి. కేంద్రం చెప్పిన విధంగా తక్షణమే అన్ని విద్యా సంస్థలను మూసివేయాలి. అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో, బస్టాండులు, రైల్వే స్టేషన్లలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతోపాటు వైద్య బృందాలను నియమించాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సూచించారు. .
Recommended Video

రంగంలోకి జనసేనలు..
రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు ప్రజలని అప్రమత్తం చేయడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. జనసేన పార్టీ తరఫున మా శ్రేణులకు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రణాళిక ఇచ్చాం. ప్రజలకు ఈ వైరస్, దాని విస్తృతిపై ప్రాథమిక అవగాహన కల్పించడంతోపాటు... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేసే వివరాలు జన సేన నాయకులకు, జనసైనికులకు తెలియచేశామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో ఒక కరోనా పాటిజివ్ కేసు నమోదు కాగా, మరో 20 మంది వరకు కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications