జగన్ సభకు అనుమతి వద్దు, సిఎంపై హైకమాండే: జానా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో అక్టోబర్ 19న తలపెట్టిన సమైక్యాంధ్ర సభకు అనుమతివ్వొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి జానారెడ్డి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కోరారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. జగన్ సభకు అనుమతివ్వొద్దంటూ తెలంగాణ మంత్రులమంతా సిఎం కిరణ్కు లేఖ రాస్తామని తెలిపారు.
రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్న సమయంలో హైదరాబాద్లో సమైక్య సభలు నిర్వహించడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని ఆయన అన్నారు. ఇలాంటి సభలను నిర్వహించడం మానుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్లో జగన్ సమైక్య సభ పెడతామనడం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమేనని అన్నారు. నల్గొండ, వరంగల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య సభకు అనుమతిప్పిస్తాం పెట్టుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడం ఎవరి తరం కాదని జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్రులు సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. సమస్య పరిష్కారానికి సలహాలు ఇవ్వకుండా ఆందోళన చేయడం, తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలని చూడటం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించే విషయం కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని ఆయన అన్నారు.
తెలంగాణ తీర్మానంపై ఓటింగ్ ఉండదు: గండ్ర
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై శాసనసభకు వచ్చే తీర్మానంపై ఓటింగ్ ఉండబోదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. అసెంబ్లీకి తెలంగాణ తీర్మాణం వస్తే ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తీర్మాణాన్ని ఓడిస్తామంటున్న నేపథ్యంలో గండ్ర వెంకటరమణారెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఆయన గురువారం హైదరాబాద్లో మాట్లాడారు. తెలంగాణ తీర్మానంపై శాసనసభ అభిప్రాయాన్ని మాత్రమే కోరతారని ఆయన తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, హోంమంత్రి సుశీల్కుమార్ షిండె, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్, ఇతర అధిష్టాన నేతలకు గండ్ర వెంకటరమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications