అనంతలో జంట హత్యల కలకలం: వేటకొడవళ్లతో నరికి చంపారు
అమరావతి: అనంతపురం జిల్లాలో మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. అనంతపురం పట్టణ శివారులోని చంద్రబాబు నగర్లో గురువారం జంట హత్యలు కలకలం రేపాయి. దీంతో గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
రుద్రంపేట కూడలిలోని చంద్రబాబు నగర్లో పరిటాల రవీంద్ర వర్గీయులుగా బావిస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రత్యర్ధి వర్గం వారు వేట కొడవళ్లుతో నరికి చంపారు. మృతులను పాత రౌడీషీటర్లు గోపినాయక్, వెంకటేశ్ నాయక్గా గుర్తించారు. గోపి నాయక్, వెంకటేశ్ నాయక్ ఇద్దరూ స్నేహితులు.
మృతి చెందిన వారికి కొంతకాలంగా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులతో విభేదాలున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలను పిలిచి పోలీసులు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నాం ఆటోలో కూర్చొని ఉన్న గోపి నాయక్, వెంకటేశ్ నాయక్లపై ప్రత్యర్ధి వర్గానికి చెందిన వారు వేటకొడవళ్లతో దాడి చేశారు.
ఈ దాడిలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం నిందితులు మారణాయుధాలను అక్కడే వదిలేసి పరారయ్యారు. వీళ్లిద్దరిపై గతంలో నాలుగు సార్లు హత్యాయత్నాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ జంట హత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు..
మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరి హత్యకు పాతకక్షలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.