విడాకులిచ్చెయ్! మరో పెళ్లి చేసుకుంటా: మోసంతో పెళ్లి, ఆమెకు అదనపు కట్నం వేధింపులు
అదనపు కట్నం కోసం వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది ఓ మహిళ. 'అదనపు కట్నంగా రూ.5లక్షలు ఇవ్వకపోతే.. విడాకులు ఇచ్చేయ్.. మరో పెళ్లి చేసుకుంటా' అని తన భర్త, అత్తామామలు వేధింపులకు గురిచేస్తున్నారంటూ వాపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న విశాఖపట్నం 3వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కట్నకానుకలతో పెళ్లి..
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖలోని చినవాల్తేరు సమీప విద్యానగర్కు చెందిన రీసు నాగేశ్వరరావు, రమణమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ప్రవీణను రాజమండ్రి సమీప కడియం ప్రాంతానికి చెందిన ఓదూరి సుమన్ కల్యాణ్తో 2014 ఆగస్టు 15న వివాహం చేశారు. కట్నం, ఆడపడుచు లాంఛనాలు, వరుడికి బంగారంతో కలిపి సుమారు రూ.11 లక్షల వరకు చెల్లించారు.
కట్నం తక్కువైందని వేధింపులు..
కాగా, సుమన్ సౌత్సెంట్రల్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలెట్గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల పాటు కడియంలో వీరి కాపురం సజావుగానే సాగింది. సుమన్ సోదరుడు దినేష్, సోదరి అలేఖ్యలు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ప్రవీణ గర్భిణిగా ఉన్న సమయంలో ఆడపడుచు అలేఖ్య, ఆమె భర్త పార్థసారథి కలిసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి రూ.10 లక్షల కట్నం చాలా తక్కువ అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ప్రవీణకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమెను రూ.5లక్షల అదనపు కట్నం తీసుకురావాలని అత్తమామలు వేధించడం ప్రారంభించారు.
విడాకుల కోసం హింసించారు..
లేదంటే విడాకులు ఇచ్చేస్తే మేనత్త కుమార్తెతో వివాహం చేస్తామని బెదిరింపులకు గురిచేశారు. విషయాన్ని ప్రవీణ తమ తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పగా.. వారు నిస్సహాయత వ్యక్తం చేశారు. ప్రవీణను భర్త, ఆడపడుచు శారీరకంగా హింసించడంతో ఆమె గర్భం పోయింది. అప్పట్లో ప్రవీణ తల్లిదండ్రులు ఈ విషయంపై అత్తింటి వారిని ప్రశ్నించగా.. సర్దిచెప్పి పంపించేశారు. సుమన్ విధుల పేరుతో పదిరోజుల పాటు ఇంటికి దూరంగా ఉండేవారు.
పుట్టింటికి పంపేసి.. దౌర్జన్యం..
ఈ క్రమంలో సుమన్ తనకు విశాఖకు బదిలీ అయిపోతుందని మాయమాటలు చెప్పి ప్రవీణను ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపించేశాడు. అప్పటి నుంచి సుమన్ వారం, పది రోజులకోసారి విశాఖలోని అత్త వారింటికి వచ్చి వెళుతుండేవాడు. ఆ తర్వాత మూడు నెలలుగా ఆయన రావడం లేదు. దీనిపై తల్లిదండ్రులతో కలిసి ప్రవీణ కడియంలోని అత్తింటికి వెళ్లి ప్రశ్నించారు. దీంతో ప్రవీణ తల్లిదండ్రులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.
కులం మార్చి చెప్పి వివాహం.. అయినా..
కాగా, వివాహం సమయంలో తమది గౌడ సామాజిక వర్గం అని సుమన్కల్యాణ్ చెప్పారని.. కానీ, అతడు వాస్తవానికి ఎస్సీ(మాదిగ) సామాజిక వర్గానికి చెందిన వారని వివాహం తరువాత తెలిసిందని ప్రవీణ తెలిపింది. అయితే, తనకు కులాల పట్టింపు లేదని ప్రవీణ పోలీసులకు వివరించింది. అయినా కూడా కులం పేరుతో దూషించారంటూ తనపై తప్పుడు కేసులు పెడతామని అత్తింటి వారు బెదిరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.