విశాఖలో డ్రగ్స్ దందా.. హాషిష్ ఆయిల్ , లిక్విడ్ గంజాయిలతో మత్తెక్కించే యువతులు ..ఎస్ఈబీ కేసులు
హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి నగరాలకు పరిమితమైన డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు ఏపీ నూతన పరిపాలన రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలో పెరిగిపోయింది. తాజాగా పలు ఆసక్తికర సంఘటనలు విశాఖ నగరంలో డ్రగ్స్ దందా ఏ విధంగా సాగుతుందో అర్థమయ్యేలా చెప్తున్నాయి. విశాఖ నగర పరిధిలో గంజాయితో సహా మాదకద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. యువతులే ఈ దందాలో మత్తెక్కిస్తున్నారు. విశాఖ నగరంలో యువత డ్రగ్స్ మత్తులో జోగుతోంది.
వైజాగ్ లో పలుచోట్ల దాడులు ... డ్రగ్స్ దందా చేస్తున్న 8 మంది అరెస్ట్
విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో విపరీతంగా గంజాయి సాగు అవుతున్న కారణంగా వివిధ ప్రాంతాలకు, వివిధ రాష్ట్రాలకు అక్కడి నుండి గంజాయి అక్రమ రవాణా చేయడమే కాకుండా, ఆ ప్రాంత వాసులు సైతం గంజాయి కి బానిసలుగా మారుతున్నారు. ఒక్క గంజాయి మాత్రమే కాదు, ఇతర మాదకద్రవ్యాలకు కూడా విశాఖ వేదికగా మారింది. ఇటీవల పలుచోట్ల దాడులు జరిపిన ఎస్ ఈ బి అధికారులు కేసులు నమోదు చేశారు. మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు .
డ్రగ్స్ దందా చేస్తున్న ఇద్దరు యువతుల అరెస్ట్ ..గ్యాస్ సిలిండర్ లో గంజా తరలింపు .. నలుగురు అరెస్ట్
ఒక అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ దందా సాగిస్తున్న ఇద్దరు యువతులను అరెస్టు చేయగా వారి వద్ద నుండి కేజీ ద్రవరూప గంజాయిని, హాషిష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు ఎస్ ఈ బి అడిషనల్ డిసిపి అజిత వేజెండ్ల . డ్రగ్స్ దందాలో యువతులు కూడా ఉండటం షాక్ కు గురి చేస్తుంది. అంతేకాదు వేరే కేసులో ఒక గ్యాస్ సిలిండర్ లో ఆటో సీటు కింద పెట్టి అక్రమంగా రవాణా చేస్తున్న 48 కిలోల గంజాయిని కూడా ఇటీవల పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్టు చేసినట్లుగా ఆమె పేర్కొన్నారు.
యువతను టార్గెట్ చేసి డ్రగ్స్ దందా .. ప్రముఖుల పిల్లలే టార్గెట్
మరో కేసులో హైదరాబాద్ కు చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు అజిత వేజెండ్ల వెల్లడించారు . ఇవి ఇటీవల పట్టుకున్న కేసులు. ఇవి కొన్ని మాత్రమే. ఇక్కడ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారుతోంది.
విశాఖపట్నంలోను యువతను టార్గెట్ చేసుకొని చాలా మంది డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారని, ముఖ్యంగా ఇలాంటి కేసులలో ప్రముఖుల పిల్లలను టార్గెట్ చేసి వారిని మత్తుకు బానిసలుగా చేస్తున్నారని తెలుస్తుంది.
ఉక్కుపాదం మోపకుంటే వైజాగ్ నగర యువత మత్తులోనే
విశాఖ ఏజెన్సీని అడ్డాగా చేసుకొని గంజాయి దందా జోరుగా సాగుతుండగా, గంజాయి తో పాటుగా ఇతర మాదకద్రవ్యాల వినియోగం కూడా క్రమంగా విశాఖలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు, మెడికోలను టార్గెట్ చేస్తూ సాగుతున్న గంజాయి తో పాటు, ఇతర మాదకద్రవ్యాల దందాకు అడ్డుకట్ట వేయడం కోసం ఎక్సైజ్, రెవిన్యూ, నార్కోటిక్స్, ఎస్ ఈబీ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే వైజాగ్ నగర యువత మత్తులో మునిగి పోవడం ఖాయం.