మందేసి చిందేసిన టీడీపీ కార్పోరేటర్లు: వెకిలి చేష్టలు, బెజవాడ పరువు తీశారు
తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పోరేటర్ల తీరుతో ప్రయాణికులు విసుగెత్తిపోయారు. విజ్ఞాన యాత్రకు వెళ్లిన బెజవాడ కార్పోరేటర్లలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు మద్యం మత్తులో రైలులో ఓ మహిళా ప్రయాణికురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.
వేధింపులకు గురైన మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పూణె రైల్వే పోలీసులు ఆ ఇద్దరు కార్పోరేటర్లను అదుుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు మేము ఫలానా అంటూ బ్రతిమలాడి ఈ వ్యవహారం నుంచి బయట పడినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే ఈ ఘటన ఏప్రిల్ 30వ తేదీ రాత్రి జరగగా బుధవారం వెలుగుచూసింది. టీడీపీ కార్పేరేటర్ల వెకిలి చేష్టలపై సమాచారం అందుకు్నన బెజవాడ మేయర్ కోనేరు శ్రీధర్ ఫోన్లోనే చివాట్లు పెట్టినట్లు సమాచారం. 'మీరు చేసే పనుల వల్ల పార్టీ పరువు పోతోంది.. మరోసారి ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే సహించేది లేదు' అంటూ హెచ్చరించారంట.
కాగా, పూణె ఘటనపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆరా తీసినట్లు సమాచారం. విజ్ఞానయాత్రంలో టీడీపీ కార్పోరేటర్లు చేసిన రచ్చ బుధవారం నగరంలో హల్చల్ చేసింది. రాజకీయ పార్టీలతో పాటు బెజవాడ కార్పొరేషన్లో ఇదే హాట్ టాపిక్గా మారింది.
విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు గత నెల 29న విజ్ఞాన యాత్రకు బయలుదేరారు. ఈ నెల 13వ తేదీ వరకు యాత్ర కొనసాగనుంది. మొత్తం 59 మంది కార్పొరేటర్లకు గాను 36 మంది యాత్రకు వెళ్లారు. మేయర్ కోనేరు శ్రీధర్, వైఎస్సార్ సీపీ ఫ్లోర్లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీలతో పాటు మరో 21 మంది టూర్కు దూరంగా ఉన్నారు.
పూణే, జైపూర్, ఆగ్రా, ఢిల్లీ, చండీఘర్, అమృత్సర్ నగరాల్లో పర్యటించేలా టూర్ షెడ్యూల్ను రూపొందించారు. ఆయా కార్పోరేషన్లలో పాలనా వ్యవహారాలు, అభివృద్ధి తదితర అంశాలపై అధ్యయనం చేయాలని ముఖ్య ఉద్దేశ్యంగా టూర్ సాగింది. ఈ టూర్ కోసం రూ.30 లక్షలు కేటాయించడంతో పాటు సదరన్ ట్రావెల్స్కు కాంట్రాక్ట్ అప్పగించారు.
ఏప్రిల్ 29న విజయవాడ నుంచి బయల్దేరిన కార్పొరేటర్లు 30వ తేదీనే మద్యం మత్తులో రైల్లో వివాదాన్ని సృష్టించారు. పూణె పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేయడంతో ఈ విషయం సద్దు మణిగింది. అయితే ఆరోజు జరిగిన సంఘటనకు సంబంధించి బుధవారం విజయవాడకు చేరింది.
ప్రస్తుతం టూర్ కొనసాగుతుండగానే ఘటన అల్లరైపోవడంతో సంబంధిత కార్పొరేటర్లు కంగుతిన్నారు. ఈ విషయంపై బెజవాడ టీడీపీ ఫ్లోర్ లీడర్ జి.హరిబాబు మీడియాతో మాట్లాడుతూ పూణేలో ఎలాంటి వివాదం జరగలేదన్నారు. కొందరు కావాలనే బెజవాడ కార్పోరేటర్లను అప్రదిష్టపాలు చేసేందుకు ఈ అల్లరి చేస్తున్నారన్నారు.
బెజవాడ మేయర్ కోనేరు శ్రీధర్ మొదటి నుంచి ఈ టూర్ను వ్యతిరేకిస్తున్నారు. నిజానికి మంత్రి నారాయణ పుష్కరాల తర్వాత వెళ్లాలని ఆదేశించారు. అయితే ఆ ప్రతిపాదనను కొందరు సీనియర్ కార్పోరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో టూర్ షెడ్యూల్ను ఖరారు చేశారు. డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ సారథ్యంలో కార్పొరేటర్లు ఈ టూర్కు వెళ్లారు.