బాబు కోరిక: డీఎస్ ఆగ్రహం, తొందరని కోదండ నిప్పులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచనల మేరకే లోకసభలో పోలవరం బిల్లు పాస్ అయిందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత డీ శ్రీనివాస్ శుక్రవారం అన్నారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం చట్ట వ్యతిరేకమైన చర్య అన్నారు. బాబు కోరిక మేరకే ఇది జరిగిందన్నారు. ఎన్డీయే అప్రజాస్వామికంగా ఇలా వ్యవహరించడమేమిటన్నారు. ప్రజలను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మభ్య పెడుతున్నాయన్నారు.
తొందరపాటు అన్న కోదండరామ్
పోలవరం బిల్లును పార్లమెంట్లో ఆమోదంపై తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ఆచార్య కోదండరాం తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. నిరసనల మధ్య బిల్లు ఆమోదం తొందరపాటు చర్యేనన్నారు. బిల్లు ఆమోదం అన్యాయమైన, అప్రజాస్వామికమైన నిర్ణయమన్నారు.

రాష్ట్రాల సరిహద్దులతో పాటు ఇతర సమస్యలు తప్పవన్నారు. బిల్లుపై చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సభలో బలముందని బిల్లు ఆమోదింప చేసుకోవడం అన్యాయమన్నారు. ఒక రాష్ట్రంలోని ప్రాంతాలను మరో రాష్ట్రంలో కలపడం చట్ట వ్యతిరేకమన్నారు.
ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఒక రాష్ట్ర ప్రాంతాలను మరో రాష్ట్రంలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం అనవసరంగా తల దూరుస్తోందన్నారు. పోలవరం బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం గిరిజనుల పాలిట శాపమని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వ్యాఖ్యానించారు. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా శనివారం ఖమ్మం జిల్లా బంద్కు పిలుపిచ్చారు.












Click it and Unblock the Notifications