చంద్రబాబుని మెచ్చుకుంటున్నా కానీ ఆ తర్వాతే: డిఎస్

హైదరాబాద్: సీమాంధ్రకు భారీ ప్యాకేజీ ఉంటుందని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజనీతిజ్ఞత ప్రదర్శించారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్ శనివారం అన్నారు ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగాక వచ్చే ఎన్నికల్లో రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌దే విజయమన్నారు.

విభజన జరిగిన తర్వాత నాలుగు నెలల్లో అంతా సద్దుమణుగుతుందని, తెలంగాణ ఆకాంక్ష తీర్చినందుకు ఈ ప్రాంత ప్రజలతో పాటు, తమకు సంపూర్ణ న్యాయం చేసినందుకు సీమాంధ్ర ప్రాంతంలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నుంచి వలసలు తాత్కాలికమేనని, రాష్ట్ర విభజన వంటి అంశాలు లేనప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైన విషయాన్ని గుర్తు చేశారు.

DS praises Chandrababu

వాస్తవానికి రాష్ట్ర విభజన 1969లోనో, జైఆంధ్రా ఉద్యమం వచ్చిన 1972లోనో, 2009 డిసెంబర్ 9నో జరిగితే ఈ నాటికి పరిస్థితులు సద్దుమణిగిపోయేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు ప్రాంతాల ప్రజలు మానసిక ఐక్యతతో ఉండేవారని అన్నారు. కొంతకాలంగా తెలుగు ప్రజల మధ్య సామరస్యపూరిత వాతావరణం చెడగొట్టి, విద్వేషాలు రగిల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించాయని, అటువంటి కార్యకలాపాలను ఇప్పటికైనా నిలిపివేస్తే మంచిదని సూచించారు.

ఎన్నికల తర్వాత తెలంగాణ ఇద్దామని యూపిఏ ఎందుకు అనుకుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీమాంధ్రులు ఊహించని స్థాయిలో పూర్తి న్యాయం చేస్తారన్నారు. రాజధాని నిర్మాణానికి నగదు మంజూరుతో సహా పలు కార్యక్రమాలకు కేంద్రం సహకారం అందిస్తుందని చెప్పారు. ఇప్పటికే కేంద్ర మంత్రుల బృందం ఒకసారి సమావేశమైందని, ఈ బృందానికి నేతృత్వం వహించిన హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తన శాఖ పరిధిలోని అంశాలను విడమరిచి చెప్పారని అన్నారు.

అసెంబ్లీ అభిప్రాయం నిమిత్తం ముసాయిదా బిల్లును పంపుతామని వివరించారని చెప్పారు. రాజ్యాంగంలోని అర్టికల్-3ను అధ్యయనం చేస్తే రాష్ట్రానికి తీర్మానం వస్తుందో, ముసాయిదా బిల్లు వస్తుందో స్పష్టంగా అర్థం అవుతుందని దీనిపై వితండ వాదనలు అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌కు మధ్య జరిగిన సంభాషణ గురించి తాను వ్యాఖ్యానించడం సరికాదన్నారు.

తెలంగాణకు సానుకూలంగా సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకున్న వెంటనే పాలకపక్షం ముఖ్యనేతల నుంచీ మిగిలిన ప్రతిపక్షాల నుంచి స్పందన రాకమునుపే చంద్రబాబు సానుకూలంగా స్పందించి రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని అన్నారు. పాలక పక్షానికి చెందిన వాడిగా తను ప్రతిపక్ష నేతను ప్రశంసించకూడదని, అయినా, ఆనాడు చంద్రబాబు వ్యవహరించిన తీరును మెచ్చుకోకుండా ఉండలేనని అన్నారు. అయితే తర్వాత ఆయన యూ టర్న్‌ను తీసుకుని అందరిలానే వ్యవహరించారని విమర్శించారు.

పూర్తిస్థాయి చర్చల అనంతరమే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు ఈ నిర్ణయం అమలు జరిగేందుకు వీలుగా సీమాంధ్ర ప్రాంత సమస్యలను పరిష్కరించేందుకు సలహాలు ఇచ్చేందుకు అఖిలపక్షం వేస్తే పర్వాలేదని, కానీ ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించేందుకు అఖిలపక్షం వేయాలని కోరితే మాత్రం సరికాదన్నారు. కేంద్ర మంత్రుల బృందాన్ని సంప్రదించి సీమాంధ్ర ప్రజలు తమ సందేహాలు, అనుమానాలను నివృత్తి చేసుకునే వీలుందని అన్నారు.

సీమాంధ్రలో రాజధాని ఎక్కడ ఉండాలన్న విషయమై ఆ ప్రాంత నేతలే చూసుకుంటారని, ఆ ప్రాంతంలో మేధావులు ఉన్నారని డిఎస్ అన్నారు. సీమాంధ్రలో మేధావులే లేరంటూ తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. డిఎస్ నవ్వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+