ఆ తర్వాత వైయస్ జగన్తో పొత్తు చెప్పలేను: డిఎస్
న్యూఢిల్లీ: తెలుగువారంతా కలిసి ఉండాలని ఇందిరా గాంధీ అంగీకరించలేదని తెలంగాణ ప్రాంతానికి చెందిన పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యకు ఆయన ఆ విధంగా సమాధానంం ఇచ్చారు. ఇందిరా గాంధీ హయాంలో 1972లో జరిగిన ఒప్పందాలను రాష్ట్రంలోని ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదని, అప్పటి నుంచి సమస్య రగులూతనే ఉన్నదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
జై ఆంధ్ర ఉద్యమంలో కూడా పోలీసు తూటాలకు చాలా మంది బలయ్యారని ఆయన అన్నారు. 1956 నుంచి తెలంగాణ ఉద్యమం కొనసాగూతూనే ఉన్నదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1969లో జరిగిన ఉద్యమంలో అనేక మంది పోలీసు తూటాలకు బలైనట్లు ఆయన తెలిపారు.

1969, 1972 సంవత్సరాల్లో జరిగిన ఉద్యమాల కారణంగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలో రెండు ప్రాంతాల మధ్య అనేక ఒప్పందాలు జరిగాయని, అయితే అవి అమలు కాలేదని ఆయన అన్నారు. 1956 నుంచి తెలంగాణ ఉద్యమం ఏదో రూపంలో ఉందని ఆయన అన్నారు. ఎన్డీయే పాలనలో మూడు రాష్ట్రాల ఏర్పాటు జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఊపందుకుందని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తో ఎన్నికలకు ముందు పొత్తు ఉండదని డిఎస్ చెప్పారు. ఎన్నికల తర్వాత పొత్తు ఉంటుందా లేదా అనే విషయంపై చెప్పలేనని ఆయన అన్నారు. రాష్ట్ర పరిస్థితుల పట్ల సోనియా కలత చెందారని ఆయన అన్నారు. అందరి అభిప్రాయం మేరకే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిందని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, హైదరాబాదులో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య కలుసుకున్నారు. కాగా, తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు సమావేశమయ్యారు. మంత్రులు బస్వరాజు సారయ్య, సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు, డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications