జగన్, చంద్రబాబు.. ఇద్దరిదీఒకే మాట!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళతారంటూ ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా ఎన్నికలు ఏ క్షణంలోనైనా జరగవచ్చని, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలంటూ పదే పదే పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ప్రభుత్వ మీడియా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు.

గర్వంతోకాదు.. వినయంగా చెబుతున్నాం
అమరావతిలో మీడియాతో మాట్లాడిన సజ్జల ఏడాదిలోకానీ, రెండేళ్లలోకానీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని, జగన్ ప్రవేశపెట్టిన పథకాలు విజయవంతమయ్యాయని, ఇది తాము గర్వంతోనో, అహంకారంతోనే చెబుతున్న మాట కాదని, గర్వంగా, వినయంగా చెబుతున్నామన్నారు. సజ్జల మాటలనుబట్టి ఏపీలో ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణతోపాటు ఒకేసారి..
షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. అసెంబ్లీకి, లోక్సభకు రెండూ ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అలా కాకుండా అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరిపి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత లోక్సభ స్థానాలను చేజిక్కించుకోవాలనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికగా ఉంది. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఆరునెలలు ముందుగా ఎన్నికలు జరపాలనేది కేసీఆర్ యోచనగా ఉంది. తెలంగాణతోపాటు ఏపీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న యోచనలో జగన్ ఉన్నారు.

ముందస్తు ఎప్పుడు అనేది నిర్ణయించుకున్నారు
తాజాగా సజ్జల చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏపీలో ముందస్తు ఎన్నికలైతే ఖాయం.. అది ఎప్పుడు అనేది ప్రభుత్వమే తెలపాల్సి ఉంది. అయితే ఎప్పుడు ముందస్తుకు వెళ్లాలనేది ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే నిర్ణయించుకున్నారని, ఒక వ్యూహం ప్రకారమే సజ్జల మీడియాతో మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కేసీఆర్ కోసం..
ఏపీ, తెలంగాణకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయడు ఏపీపైనే దృష్టిసారిస్తారు. తెలంగాణమీద దృష్టిపెట్టరుకాబట్టి ఒకరకంగా తన మిత్రుడు కేసీఆర్కు జగన్ మేలు చేసినట్లవుతుందని, అందుకే ఆయన తెలంగాణతోపాటు ఎన్నికలకు వెళ్లబోతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరి అంచనాలు నిజమవుతాయో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.!!












Click it and Unblock the Notifications