వైజాగ్-గుంటూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. !
వైజాగ్ నుంచి గుంటూరు వెళ్లే ప్రయాణికులకు తూర్పు కోస్తా రైల్వే ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే వైజాగ్ నుంచి విజయవాడ వరకూ ప్రయాణిస్తున్న ఓ కీలక ఎక్స్ ప్రెస్ రైలును గుంటూరు వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో విశాఖ నుంచి గుంటూరు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఇది సౌకర్యంగా మారనుంది. తూర్పు కోస్తా రైల్వే నిర్ణయంతో ఇప్పటివరకూ విశాఖ నుంచి విజయవాడ వరకే వెళ్తున్న ఈ రైలు ఇకపై గుంటూరు వరకూ వెళ్లబోతోంది.
విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం (22701/22702) మధ్య నడిచే డబుల్ డెకర్ ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలును తూర్పు కోస్తా రైల్వే ఇవాళ గుంటూరు వరకు పొడిగించింది. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం విశాఖపట్నం-విజయవాడ ఉదయ్ ఎక్స్ప్రెస్ రైళ్లను గుంటూరు స్టేషన్ వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

ఇందులో ముందుగా రైలు నం.22701 విశాఖపట్నం-విజయవాడ ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలు 13.01.2024 నుండి గుంటూరు వరకు పొడిగిస్తారు. ఇది విశాఖపట్నం నుంచి 05.20 గంటలకు బయలుదేరి 11:25 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 11:25 గంటలకు బయలుదేరి 11.35 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలునం.22702 గుంటూరు-విజయవాడ- విశాఖపట్నం గుంటూరులో 16.00 గంటలకు బయలుదేరి 17.05 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 17.15 గంటలకు బయలుదేరి 22..22 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
అలాగే ఈ రైలుకు విశాఖపట్నం-గుంటూరు మధ్య దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడలో స్టాప్లు ఇచ్చారు. కాబట్టి ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని తూర్పు కోస్తా రైల్వే కోరుతోంది.












Click it and Unblock the Notifications