శోభానాగిరెడ్డి మృతి: ఆళ్లగడ్డ ఎన్నికపై ఈసి తర్జన భర్జన
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, ఆ పార్టీ ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ పైన ఎన్నికల సంఘం తర్జన భర్జన పడుతోంది. ఎన్నికల సంఘం కలెక్టర్ నివేదికను కోరింది. కలెక్టర్ నివేదిక ఆధారంగా ఎన్నిక నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులు మృతి చెందితే ఎన్నిక రద్దు చేస్తారు. అయితే, శోభా నాగిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినందున ఈసి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి దీనిని తీసుకు వెళ్లనుంది.
నంద్యాలకు శోభ మృతదేహం
శోభా నాగిరెడ్డి మృతదేహాన్ని ఆళ్లగడ్డకు తరలిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రజల సందర్శనార్థం పార్టీ కార్యాలయంలో ఉంచనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి. ప్రజలు, బంధువులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

గవర్నర్ సంతాపం
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శోభా నాగిరెడ్డికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సంతాపం ప్రకటించారు. రాష్ట్రం మంచి రాజకీయవేత్తను కోల్పోయిందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.
శోభా నాగిరెడ్డి బంధువులను అల్లు అరవింద్, నన్నపనేని రాజకుమారి తదితరులు పరామర్శించారు. శోభ మృతి చెందిన విషయం తెలిసి.. రాజశేఖర్, జీవిత, మైసూరా రెడ్డి, ఇతర పార్టీల నాయకులు భారీగా తరలి వస్తున్నారు. విజయమ్మ, షర్మిల, జగన్ కూడా ప్రచారం రద్దు చేసుకొని వస్తున్నారు.












Click it and Unblock the Notifications