Andhra Pradesh Assembly Election 2024: ఏపీలో కోడ్ వచ్చాక ఈసీ తొలి వేటు..!
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీంతో రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, ఇతరులు చేయాల్సిన, చేయకూడని పనుల్ని ఈసీ మార్గదర్శకాల్లో పేర్కొంది. వీటి ప్రకారం అందరూ నడుచుకోవాల్సిందే. విఫలమైతే చర్యలు తప్పవని హెచ్చరించింది. చెప్పినట్లుగానే ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఓ ఉద్యోగిపై వేటు వేసేసింది. ఎన్నికల కోడ్ వచ్చాక రాష్ట్రంలో ఈసీ తొలి వేటు ఇదే.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం, దిమిలి గ్రామానికి చెందిన వీఆర్వో కె. రమేష్ పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. దీనికి అనుగుణంగా కలెక్టర్ ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా రమేష్ అధికార వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు స్ధానిక తహసీల్దార్ ఇచ్చిన నివేదిక మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద రమేష్ పై వచ్చిన ఆరోపణల్ని సమగ్రంగా విచారించిన తర్వాత తప్పు చేసినట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా కోడ్ అమలును కఠినంగా పర్యవేక్షిస్తామని, తప్పు చేసినట్లు తేలితే ఎవరిపై అయినా చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. ముఖ్యంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై నిఘాకు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వీఆర్వో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు వార్తా పత్రికల్లో వచ్చిన వార్త, క్షేత్రస్దాయిలో వాస్తవాల పరిశీలన తర్వాత ఈ వేటు పడింది.












Click it and Unblock the Notifications