Nara Bhuavaneswari: నారా భువనేశ్వరితో భేటీ- కానిస్టేబుల్ పై ఈసీ చర్యలు..!
ఏపీలో ఎన్నికల వేళ ఈసీ కొరడా ఝళిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన దగ్గరి నుంచీ కోడ్ అమల్లోకి రావడంతో ఉల్లంఘించిన వారిపై సీవిజిల్ తో పాటు ఇతర మాధ్యమాల్లో వస్తున్న ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాల ద్వారా పరిశీలిస్తున్న ఎన్నికల సంఘం ఏమాత్రం తేడా వచ్చినా వేటుకు వెనుకాడటం లేదు. ఇదే క్రమంలో తాజాగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో భేటీ అయిన ఓ కానిస్టేబుల్ పైనా చర్యలు తీసుకుంది.
అసలేం జరిగిందంటే.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తాజాగా తన నిజం గెలవాలి యాత్ర కోసం అన్నమయ్య జిల్లా వెళ్తూ మధ్యలో తిరుపతి జిల్లాలో స్ధానికంగా ఉన్న ఓ కానిస్టేబుల్ వచ్చి ఆమెను కలిశారు. భాకపాపేట మీదుగా యాత్రకు ఆమె వెళ్తున్నప్పుడు సాకిరి రాజశేఖర్ అనే ఓ కానిస్టేబుల్ ఆమెను కలిశారు. తిరుపతి దిశ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న రాజశేఖర్ రాజకీయ పార్టీ నేత అయిన భువనేశ్వరిని ఇలా కలవడంపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈసీ చర్యలకు దిగింది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించి ఇలా ఓ రాజకీయ పార్టీ నేతను కలవడంపై వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించిన ఈసీ.. కానిస్టేబుల్ రాజశేఖర్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాజశేఖర్ పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈసీ ఆదేశాలతో సస్పెన్షన్ వేటు వేసినట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగపర్చడం, రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications