రైల్వే సూపర్ గుడ్ న్యూస్!! రూ.20కే భోజనం
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. తక్కువ ధరకే భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు రైల్వేస్టేషన్లలో తక్కువ ధరకే భోజనాన్ని పొందొచ్చని ప్రకటించింది. తక్కువ ధరలో నాణ్యమైన ఆహారాన్ని అందించడం కోసం ఎకానమీ మీల్స్ పేరుతో అందుబాటులోకి తెచ్చారు. రెండు రకాల భోజనం అతి తక్కువ ధరకే ఇస్తున్నారు.
జనరల్ బోగీల్లో ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకొని 'ఎకానమీ మీల్స్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది రూ.20కాగా, కాంబో మీల్ ధర రూ.50 మాత్రమే. హోటల్ లేదా రెస్టారెంట్లో ఈ తరహా భోజనం పొందాలంటే రూ.100 ఖర్చు చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, రేణిగుంట రైల్వేస్టేషన్లలో ఈ ఎకానమీ మీల్స్ అందుబాటులోకి వచ్చింది. ప్రయోగాత్మకంగా ఇక్కడ పరిశీలిస్తున్నారు. త్వరలోనే అన్ని స్టేషన్లకు విస్తరింపచేస్తారు.

ఐఆర్సీటీసీ నిర్వహించే జన్ ఆహార్ ఫుడ్ ఔట్లెట్స్, రిఫ్రెష్మెంట్ రూమ్స్లో 'ఎకానమీ మీల్స్' కొనుగోలు చేయొచ్చు. స్టేషన్ లోని ప్లాట్ ఫామ్స్ పై కూడా భోజనం దొరుకుతుంది. జనరల్ బోగీలకు సమీపంలో ఉండేలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. గుర్తింపు పొందిన వెండర్స్ మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. భోజనాన్ని రెండు కేటగిరీలుగా విభజించారు.
మొదటి కేటగిరీలో 7 పూరీలతో పాటు ఆలు కూర, పచ్చడిని కలిపి 20 రూపాయలకే అందిస్తారు. రెండో కేటగిరీలో అన్నం, రాజ్మా, ఛోలే, కిచిడీ కుల్చే, భతురే, పావ్భాజీ, మసాలా దోశల్లో ఒక దానిని ఎంచుకోవచ్చు. దీని ధర రూ.50. 200 మిల్లీలీటర్ల ప్యాకేజ్డ్ వాటర్ గ్లాసులను సైతం ఆయా కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంచుతారు. రూర్కీ, జార్సుగుడ, ఖుర్దా రోడ్డు స్టేషన్లలో ఈ తరహా సేవలు అందుబాటులోకి వచ్చాయి.

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఎకానమీ మీల్స్ అందుబాటులోకి తెచ్చారు. రైల్వేస్టేషన్లలో అమ్ముతున్న భోజనం ప్యాకెట్లు ధర ఎక్కువవడమే కాకుండా నాణ్యత లోపిస్తోందని ఐఆర్ సీటీసీకి ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. దీంతో నాణ్యమైన ఆహారాన్ని అందుబాటు ధరలో ఉండేలా ఎకానమీ మీల్స్ పథకాన్ని తీసుకువచ్చారు,.












Click it and Unblock the Notifications