కల్తీ మద్యం కేసులో ట్విస్ట్: మల్లాది విష్ణు ఆస్తులు రూ.600 కోట్లు
విజయవాడ: విజయవాడ స్వర్ణ బార్ కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తిరిగింది. కల్తీ మద్యం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కాంగ్రెసు నాయకుడు మల్లాది విష్ణు దాదాపు రూ. 600 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు గుర్తించిందంటూ టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి.
మల్లాది విష్ణు కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడు. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. మల్లాది విష్ణు అక్రమాస్తుల కేసును సిట్ ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడి)కి అప్పగించినట్లు సమాచారం.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మల్లాది విష్ణు భారీగా అస్తులు సమీకరించుకున్నట్లు తెలుస్తోంది. బినామీల పేర్ల మీద పెద్ద యెత్తున ఆస్తులను కూడబెట్టినట్లు చెబుతున్నారు.
చంద్రబాబుపై ఫైర్: రోజా సహా ప్రతిపక్షాల నేతలను వేధిస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పరిసరాల్లో 28 వేల ఎకరాలను ఆయన సమీకరించుకున్నట్లు చెబుతున్నారు. వుడా చైర్మన్గా ఉన్నప్పుడు భారీగా ఆస్తులు సంపాదించినట్లు అనుమానిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పరిధిలో లేని ప్రాంతాల్లో మల్లాది విష్ణు భూములు సమీకరించకున్నట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే, ఆ వార్తలను మల్లాది విష్ణు ఖండిస్తున్నారు. తనకు అన్ని ఆస్తులు లేవని ఆయన అన్నారు. అటువంటివి ఏమీ లేవని ఆయన అన్నారు. తనపై అధికార తెలుగుదేశం పార్టీ కక్ష సాధిస్తోందని ఆయన అన్నారు.