జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు- మరో కాంట్రాక్టర్ ఇళ్లలోనూ- తాడిపత్రిలో టెన్షన్
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఇవాళ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు క్లాస్ 1 కాంట్రాక్టర్ అయిన చవ్వా గోపాల్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపైనా ఈడీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై తెల్లవారు జాము నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆయనకు సన్నిహితుడైన కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాల సమయంలో ఆయన సోదరుడు దివాకర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఈడీ అధికారుల నుంచి సోదాలకు సంబంధించి వివరాలు ఆయన తెలుసుకుంటున్నట్లు సమాచారం.
జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాలతో పాటు వ్యాపారాలు, కాంట్రాక్టుల్లోనీూ చురుగ్గా ఉంటారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే, ఆయన సోదరుడు దివాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. దివాకర్ ట్రావెల్స్ పేరుతో బస్సుల్ని కూడా నడుపుతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరి వ్యాపారాలపై దెబ్బ పడింది. ప్రభుత్వం వీరిని పూర్తిగా టార్గెట్ చేయడంతో కొన్ని వ్యాపారాల్ని మూసేశారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి రాజకీయాలకు పరిమితం అవుతుండగా.. దివాకర్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు.