'ముంపు గ్రామాలు అప్పగించండి': అధికారుల డైలమా
హైదరాబాద్: పోలవరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించిన నేపథ్యంలో ముంపు మండలాల విలీన ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్రపతి విడిదల చేసే గెజిట్ ప్రమాణికం కానుంది. పోలవరం ముపు మండలాలు ఏపీలో విలీనమైనందున తమకు అప్పగించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్కు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ లేఖ రాశారు.
భద్రాచలం గ్రామం మినహా మండలంలోని మిగిలిన గ్రామాలను రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో కలపనున్నట్లు చెప్పారు. ఆ గ్రామాలకు ప్రస్తుతం భద్రాచలం మండలంలోని నెల్లిపాకను మండల కేంద్రంగా గుర్తించినట్లు లేఖలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చెప్పారు.
కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు మండలాలను కూడా రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో కలపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సి ఉన్నందున ఏపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు తమకు ముంపు మండలాలను అప్పగించాలని కోరారు.
మరోవైపు, ముంపు మండలాల్లో పని చేస్తున్న అధికారులు గందరగోళానికి గురువుతున్నారు. ముంపు మండలాల్లో పని చేస్తున్న అధికారులు ఇరు జిల్లాల ఉన్నతాధికారులకు జవాబుదారీగా ఉండాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరు ఏ సమాచారం అడిగినా చెప్పాలా... వద్దా, చెబితే ఏమవుతుందోనని సందిగ్ధంలో ఉన్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న మండలాలు.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో కలుస్తున్నాయి.