లవ్ అఫైర్: 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమించిన యువకుడి కోసం పెద్దలనే ఎదిరించిన 8వ తరగతి చదువుతున్న అనితా భాయి అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లిలో జరిగింది. ఇందిరమ్మ కాలనీకి చెందిన శ్రీరాముల నాయక్ కూతురు అనితా భాయి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.
అదే గ్రామానికి చెందిన బోయి శివతో ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసి పెద్దలు బాలికను మందలించారు. దీంతో మనస్థాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్పాప్తు చేపట్టారు.
ఏనుగు బీభత్సం
ఇదిలావుంటే, చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం సింగారిపురం గ్రామంలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలపై పడ్డ ఏనుగుల మంద పంటలను నాశనం చేశాయి. అనంతరం గ్రామంలోకి ప్రవేశించేందుకు ఏనుగులు ప్రయత్నించడంతో వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు టపాసులు పేల్చి ఏనుగులను అడవుల్లోకి మళ్లించారు. చేతికి వచ్చిన పంటల నేలపాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల ఆగడాలకు అధికారులు అడ్డుకట్ట వేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
వృద్ధుడి ఆత్మహత్యయత్నం
మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన హజీ హీరా సహెబ్ అనే వృద్ధుడు ఫించన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే దరఖాస్తుపై అధికారులెవరూ పట్టించుకోలేదనే ఆవేదనతో కలెక్టరేట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వృద్ధుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.