పింఛను అక్కర్లేదయ్యా!: చంద్రబాబును విస్మయపరచిన 80 ఏళ్ల వృద్ధురాలు
కోటప్పకొండ: గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ పర్యటనలో శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి వింత అనుభవం ఎదురైంది. తనను కలిసేవారు అది కావాలనో, ఇది కావాలనో అడగడమే తప్పించి, ప్రభుత్వం నుంచి అందుతున్న పింఛనును తనకు కాకుండా అవసరం ఉన్న నిరుపేదలకు అందిస్తే బాగుంటుందని స్వయంగా ఓ వృద్ధురాలు చెప్పడంతో చంద్రబాబును విస్మయపరిచింది.

వృద్ధురాలి సూచనకు స్పందించిన చంద్రబాబు ఆమె నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని మెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే... శుక్రవారం సీఎం చంద్రబాబు కోటప్పకొండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబును 80 ఏళ్ల వృద్ధురాలు ఆప్యాయంగా పలుకరించారు.
అంతేకాక ఆమె మనస్ఫూర్తిగా చంద్రబాబును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.
చంద్రబాబు: అమ్మా... నీకు పింఛను అందుతున్నదా?
వృద్ధురాలు: నాకు పింఛను అక్కర్లేదయ్యా
చంద్రబాబు: ఎందుకనమ్మా?
వృద్ధురాలు: నన్ను నా కూతురు, కుమారులు బాగా చూసుకుంటారు. పింఛను పేదలకు అందితే సంతోషిస్తా
చంద్రబాబు: అమ్మా... నీ నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
వృద్ధురాలు: చల్లగా ఉండయ్యా
ఆ తర్వాత తనను మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన వృద్ధురాలిని చంద్రబాబు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ తర్వాత జరిగిన సభలో చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయం: టీటీడీ
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించనున్నట్లు టీటీడీ ఈవో డి.సాంబశివరావు తెలిపారు. అందుకోసం పది ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని, అనుమతి రాగానే నభూతో.. అన్న రీతిలో ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు.
శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ తరుపున పట్టువస్త్రాలు సమర్పణకు తిరుపతి నుంచి శ్రీశైలం వెళ్తూ శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆగిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications