జనసేన ఆవిర్భావ వేడుకలకు బ్రేక్ వేసిన ఎన్నికల కోడ్ ... ఎలాగంటే
ఆవిర్భావ వేడుకలకు సిద్ధం అవుతున్న జనసేనకు ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించారు జనసేన నేతలు . తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు చేస్తామని ప్రకటించిన పార్టీకి ఈసీ షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో నో హంగామా అని, అనుమతులు తీసుకోవాలని , ప్రతీదీ లెక్క చెప్పాలని తేల్చేసింది .

రేపు ఆరో వసంతంలోకి జనసేన పార్టీ
2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల కోసం పోరాటం సాగించే పార్టీగా , ప్రశ్నించే పార్టీగా జనసేన పార్టీని స్థాపించారు. ఈ మార్చి 14వ తేదీన అంటే రేపు జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవాల్సి ఉంది.గతంలో ఈ వేడుకను ఎంతో ఆర్భాటంగా ఘనంగా జరుపుకున్నారు. 2018లో రాజమండ్రి వేదికగా, 2019లో గుంటూరు వేదికగాను జనసేన ఆవిర్భావ వేడుకలు జరిగాయి. బహిరంగ సభలు నిర్వహించి జనసేన పార్టీ ఉనికి అందరికీ తెలిసేలా సెలబ్రేషన్స్ సాగాయి.

ఘనంగా వేడుకలు.. భారీ సభ నిర్వహించాలని భావించిన జనసేన
ఇక ఈ సారి వేడుకలను ఘనంగా జరుపుకోవటమే కాకుండా ఏపీలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలని భావిస్తున్న జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించి , ఆవిర్భావ దినోత్సవ సభనే అధికార పార్టీపై పోరాటం చేసే వేదికగా మలచుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జనసేన తన ఆవిర్భావ దినోత్సవాన్ని పూర్తిస్థాయిలో జరుపుకోలేకపోతుంది.

ఎలెక్షన్ కోడ్ ఉన్న నేపధ్యంలో వార్షికోత్సవ వేడుకలకు అడ్డంకి
ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటంతో144 సెక్షన్ తో పాటుగా పార్టీ పరంగా బహిరంగ సభలు చేపట్టినా షరతులు వర్తిస్తాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం జనసేన ఆవిర్భావ సభ నిర్వహించినా దాని ఖర్చు పార్టీ తరపున పోటీ చేస్తున్న నాయకుల ఖాతాలో పడుతుంది. ఇక దీంతో జనసేన ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ స్థానిక ఎన్నికల కోడ్తో డైలమాలో పడింది. ఒకవేళ జనసేన బహిరంగ సభ నిర్వహిస్తే ఖర్చు లెక్క చూపించాల్సి వస్తుంది.

రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో ఆవిర్భావ వేడుకలు
ఇలాంటి పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో జనసేన తన బహిరంగ సభను పక్కకు పెట్టి రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకోనుంది . 14న ఉదయం 11 గంటలకు పార్టీ కార్యవర్గ సభ్యులతో సమావేశమై సాయంత్రం 4 గంటలకు ధవళేశ్వరం శ్రీరామ పాదాల రేవు దగ్గర గోదావరికి హారతి ఇచ్చి మన నుడి - మన నది కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 15న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోనే మేధావులతో, సామాజిక వేత్తలతో రాష్ట్ర పరిస్థితులపై, వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఇక భారీగా నిర్వహించాలనుకున్న ఆవిర్భావ సభను రద్దు చేసుకుని పలు కార్యక్రమాలతో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోనున్నారు.












Click it and Unblock the Notifications