AP Polling Percentage: ఏపీలో తేలిన పోలింగ్ శాతం ! గెలుపోటముల్ని మార్చే లెక్క..!
ఏపీలో నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అర్ధరాత్ర వరకూ సాగింది. ముఖ్యంగా రాష్ట్రంలో నివసిస్తున్న ఓటర్లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఇక్కడ ఓట్లేశారు. దీంతో భారీ ఎత్తున పోలింగ్ నమోదవుతున్నట్లు నిన్నే తేలిపోయింది. ఇందుకు తగినట్లుగానే నిన్న సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత క్యూలో ఉన్న వారు వేసిన ఓట్లతో కలిపి అర్ధరాత్రి 12 గంటలకు 78 శాతం పోలింగ్ నమోదైంది.
అయితే ఆ తర్వాత కూడా పలు చోట్ల పోలింగ్ జరిగింది. దీని కోసం ఈసీ ప్రత్యేక ఈవీఎంలను కూడా పంపాల్సిన పరిస్ధితి ఎదురైంది. దీంతో అప్పటికప్పుడు రిజర్వులో ఉన్న ఈవీఎంలను పంపి ఓట్లు వేయించింది. ఈ పరిస్ధితుల్లో పోలింగ్ శాతం 80 దాటిపోతుందని రాజకీయ పార్టీలు ఇప్పటికే అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా మొత్తం మీద 81 శాతం పోలింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నట్లు ఇవాళ తెలిపారు.

నిన్న జరిగిన పోలింగ్ లో అర్ధరాత్రి 12 గంటల నాటికి 78.25 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో తెలిపారు. దీనికి పోస్టల్ ఓటింగ్ కూడా కలుపుకుంటే 79.4 శాతానికి ఇది చేరుతుందని వెల్లడించారు. గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మొత్తం పోలింగ్ 79.8 శాతం జరిగిందని, ఈసారి ఆ రికార్డు బద్దలవుతుందని ఆయన అంచనా వేసారు. ఫైనల్ గా 81 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఇప్పటికే ఈవీఎం ఓట్లను ఫామ్ 17ఏ రిజిస్టర్ తో సరిపోల్చే కార్యక్రమం జరుగుతుందని అది పూర్తి కాగానే అధికారిక ప్రకటన చేస్తామన్నారు.
రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగితే అది తమకే మేలు చేస్తుందని అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ చెప్తున్న నేపథ్యంలో సీఈవో వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈసారి భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేయడంలో ఈసీ పాత్రతో పాటు రాజకీయ చైతన్యం కూడా పెరగడం కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 83 శాతం పోలింగ్ టార్గెట్ గా పనిచేస్తున్నట్లు గతంలోనే ఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 81 శాతం వచ్చినా సక్సెస్ అయినట్లే.












Click it and Unblock the Notifications