APBRS: ఏపీలో రాష్ట్ర పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేసిన ఈసీ
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపు రద్దు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం(election commission). 2014, 2019 ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ గుర్తింపును ఉపసంహరించింది.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసువచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు పలు రాష్ట్రాల్లో పార్టీ నేతలకు బాధ్యతలు కూడా అప్పగించారు. ఈ క్రమంలోని ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను కేసీఆర్ నియమించారు.

మరోవైపు, పాండిచ్చేరిలో పీఎంకే, పశ్చిమబెంగాల్లో ఆర్ఎస్పీల రాష్ట్ర గుర్తింపులను కూడా రద్దు చేసింది ఎన్నికల సంఘం. అయితే, ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీకి రాష్ట్ర పార్టీ గుర్తింపు ఇచ్చింది. మణిపూర్లో పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే పార్టీల రాష్ట్ర హోదాను కూడా రద్దు చేసింది. మరోవైపు, మేఘాలయలో వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా కల్పించింది. నాగాలాండ్లో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. త్రిపురలో రాష్ట్ర పార్టీగా టిప్ర మోత పార్టీకి గుర్తింపు దక్కింది.
మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, ఎన్సీపీ పార్టీలకు జాతీయ పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతేగాక, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి శుభవార్త చెప్పింది.
ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి జాతీయ పార్టీ హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 2012లో స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ మొదట ఢిల్లీలో మాత్రమే పోటీ చేస్తూ తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పొరుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ పోటీ చేసింది. ఇటీవల పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అంతేగాక, ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. అయితే, గుజరాత్ రాష్ట్రంలో ఐదు అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. 12 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీకి అర్హతను అందుకుంది. ఇక మరోవైపు, ఇతర రాష్ట్రాల్లో ఓట్లను సాధించడంలో విఫలమైన శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) జాతీయ పార్టీ హోదాలను కోల్పోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications