Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్ధులు వరుసగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ నెల 24, 25 తేదీల్లో మంచి ముహుర్తాలు ఉండటంతో ఆ రోజుల్లో నామినేషన్లు వేసేందుకు మరికొందరు అభ్యర్ధులు ఏర్పాట్లు చేసుకుంటన్నారు. ఇదే క్రమంలో గన్నవరం అసెంబ్లీ నుంచి మరోసారి ప్రత్యర్ధులుగా బరిలోకి దిగుతున్న అభ్యర్ధులు వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు కూడా సిద్ధమయ్యారు.
గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్ లో వైసీపీ అభ్యర్ధిగా వల్లభనేని వంశీ, టీడీపీ నుంచి కూటమి అభ్యర్ధిగా యార్లగడ్డ వెంకట్రావు ఈ నెల 25న నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా అనుమతి ఇవ్వాలని కోరుతూ ముందుగా రిటర్నింగ్ అధికారిని ఆశ్రయించారు. అయితే వీరిద్దరి విజ్ఞప్తులను రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. దీనికి కారణం ఇప్పటికే ఉప్పూనిప్పుగా ఉంటున్న వీరిద్దరూ ఒకేసారి నామినేషన్ వేయడానికి వస్తే పరిస్ధితులు ఉద్రిక్తంగా మారే ప్రమాదం పొంచి ఉండటమే.

దీంతో ఈ నెల 25న నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దమైన వల్లభనేని వంశీతో పాటు యార్లగడ్డ వెంకట్రావును మరో తేదీ ఎంచుకోవాలని రిటర్నింగ్ అధికారి సూచించినట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒక్కరైనా మరో తేదీ ఎంచుకుంటే అప్పుడు 25న మరొకరికి నామినేషన్ తేదీ ఖరారు చేయొచ్చని రిటర్నింగ్ అధికారి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు వీరిద్దరూ వెనక్కి తగ్గుతారా లేక పంతానికి పోయి 25న కాకుండా మరో తేదీ ఎంచుకుంటారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications