కెసిఆర్ ఒంటరి: తెలంగాణలో ముక్కోణపు పోటీ
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితి మారకపోతే తెలంగాణలో ముక్కోణపు పోటీ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ ఛాంపియన్గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఒంటరిగానే బిజెపి - తెలుగుదేశం కూటమిని, కాంగ్రెసు - సిపిఐ కూటమిని ఎదుర్కోవడానికి సిద్ధఫడుతున్నారు.
తెలంగాణలో మజ్లీస్, సిపిఎం, టిఆర్ఎల్డి వంటి పలు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటకీ పోటీ మాత్రం మూడింటి మధ్యనే ఉంటుంది. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు ఉనికి కూడా చాటుకునే పరిస్థితిలో లేదు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, 17 లోకసభ స్థానాలు ఉన్నాయి.
నిజానికి, తెలంగాణలో కాంగ్రెసు, తెరాసకు మధ్యనే పోటీ ఉంటుందని భావించారు. అయితే, బిజెపి, తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడంతో ఆ కూటమి బలం చాటుకునే అవకాశాలున్నాయి. ఓట్లు చీలకుండా ఉండడానికి ఈ రెండు పార్టీలు పొత్తుకు సిద్ధపడి తెరాసను, కాంగ్రెసును ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాయి.
2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, తెరాస మహా కూటమి కట్టి పోటీ చేశాయి. అయినా, కాంగ్రెసు 50 స్థానాలను గెలుచుకుంది. తెలుగుదేశం 39, తెరాస 10, మజ్లీస్ ఏడు, సిపిఐ నాలుగు, బిజెపి రెండు, ప్రజారాజ్యం రెండు సీట్లు గెలుచుకున్నాయి. సిపిఎం, లోకసత్తాలకు ఒక్కటేసి సీట్లు వచ్చాయి. ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా విజయం సాధించాడు.
తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పార్టీల బలాబలాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం కాంగ్రెసుకు 50 మంది, తెరాసకు 28 మంది, తెలుగుదేశం పార్టీకి 25 మంది, బిజెపికి నలుగురు శాసనసభ్యులు ఉన్నారు. తెరాస శాసనసభ్యులు తెరాసలో చేరారు. దీంతో టిడిపి బలం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుత సర్వేలను బట్టి కూడా టిడిపి తెలంగాణలో పూర్తిగా దిగజారిపోయినట్లు కనిపిస్తోంది. దాంతో బిజెపితో టిడిపి పొత్తుకు సిద్ధపడింది.