ఏపిలో ముగిసిన పోలింగ్: ఉద్రిక్త పరిస్థితులు..ఇద్దరి మృతి : కొనసాగుతున్న ఓటర్ల క్యూ..!
ఉద్రిక్త పరిస్థితులు..ఫిర్యాదుల నడుమ ఏపిలో పోలింగ్ ముగిసింది. అనంతపురం..కర్నూలు..చిత్తూరు..పల్నాడు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతపురం లో జరిగిన ఘర్షణ లో ఇద్దరు మృతి చెందారు. పల్నాడు లో ఇద్దరు అభ్యర్దుల పై దాడులు జరిగాయి. చిత్తూరు లో వైసిపి అభ్యర్ది పై దాడి చేసారు. ఇక, పలు చోట్ల రీ పోలింగ్ కోసం పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సమయం ముగిసినా..ఇంకా పలు చోట్ల ఓటర్లు లైన్లలో ఉన్నారు.
ఏపిలో ముగిసిన పోలింగ్..
ఏపిలోని 25 లోక్సభ..175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభ మైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ప్రారంభ సమయంలో పలు ప్రాంతాల్లో ఇవియంల సమస్య తలెత్తింది. ఆ తరువాత పోలింగ్ అధికారులు సమస్యను పరిష్కరించారు. ఇక, సాయంత్రం 5 గంటల వరకు 63 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసినా..ఇంకా పలు ప్రాంతాల్లో పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఆరు గంటల లోగా పోలింగ్ బూత్ లకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల సం ఘం ప్రకటించింది.
ఇద్దరి మృతి..ఉద్రిక్త పరిస్థితులు
పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఉద్రక్తి పరిస్థితులు టెన్షన్ వాతావరణాన్ని సృష్టించాయి. తాడిపత్రి నియోజకవర్గం లో టిడిపి..వైసిపి వర్గాల మధ్య జరిగిన ఘర్ణణ ఇద్దరి మృతికి కారణమైంది. గుంతకల్ లో జనసేన అభ్యర్ది మధు సూధన గుప్తా పోలింగ్ బూత్ లో ఇవియం ను ధ్వంసం చేసారు. ఇక, పల్నాడు లో టిడిపి సత్తెనపల్లి అభ్యర్ది కోడెల శివ ప్రసాద్, నర్సరావు పేట వైసిపి అభ్యర్ది పై ప్రత్యర్ధి పార్టీలు దాడులు చేసాయి. ఇక, చిలకలూరి పేట లో రిగ్గింగ్ చేస్తున్నారంటూ టిడిపి నేతల వీడియో ను వైసిపి నేతలు ఎన్నికల సంఘానికి అంద చేసారు. ఇక, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో టిడిపి .. వైసిపి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
రీ పోలింగ్ కు అవకాశాలు..
ఏపి లో పలు ప్రాంతాల్లో రీ పోలింగ్ కు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. గుత్తి, చిలకలూరి పేట, సత్తెనపల్లి, గురజాల, తాడిపత్రి, ఆళ్లగడ్డ నియోజకవర్గాల పరిధిలో వివాదాస్పదంగా మారిన పోలింగ్ బూత్ ల్లో రీ పోలింగ్ నిర్వహిం చాలని టిడిపి..వైసిపి డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఎక్కడైతే ఫిర్యాదులు వచ్చాయో వాటి పై జిల్లా కలెక్టర్లు..రిట ర్నింగ్ అధికారుల నుండి ఇసి వివరణ కోరింది. వారిచ్చే నివేదికల ఆధారంగా రీ పోలింగ్ పై నిర్ణయం తీసుకోనుంది.