కర్నూలుకు గుడ్న్యూస్
కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ సంస్థ కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర 12వందల ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్కు నెలకొల్పేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకొంది.
ఇందుకు సంబంధించిన వివరాలను పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో విశ్వ ప్రసాద్ తెలియచేశారు. వాహన తయారీ, ఆర్అండ్డి. కేంద్రాలు, టెస్టింగ్ ట్రాక్స్, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ప్రాంతాలాంటివి ఇందులో ఉంటాయి. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ ఈవీ పార్కు. దీని ద్వారా రూ.13 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయనీ, 25 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. 'కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్ ఏర్పాటు కానుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఇదొక మైలు రాయి' అన్నారు. కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంపై ప్రధానమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి వచ్చే దిశగా కృషి చేస్తున్నట్లు పవన్ తెలిపారు. ఈ సమావేశంలో భాస్కర రెడ్డి, రవికిరణ్ ఆకెళ్ళ, బాబ్ డఫ్ఫీ, స్టీవ్ గెర్బర్, హెరాల్డ్ రక్రిజెల్ ఉన్నారు.
విజిలెన్స్, ఏసీబీ, శాఖాపరమైన విచారణలు వేగవంతం
ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉంచడానికి కారణాలు, ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయో వాటి వివరాలపై నివేదిక సిద్ధం చేయాలని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగుల పనితీరు మీద సున్నితమైన విజిలెన్స్ ఉండాలి. వారు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పని చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉద్యోగుల నిజాయతీ, పనితీరు, నిబద్ధతకు అది ఓ సూక్ష్మదర్శనిలా పని చేస్తుంది. అయితే ఉద్యోగులపై నమోదు అవుతున్న విజిలెన్స్ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు, చర్యలు ఏళ్ల పాటు పెండింగ్లో ఉండిపోవడం ఉద్యోగుల పని తీరుపై ప్రభావం చూపిస్తుందనీ పవన్ స్పష్టం చేశారు.
క్రమశిక్షణ చర్యలు, శాఖపరమైన విచారణలకు సంబంధించినవి ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అంశంపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృధ్ది, ఆర్.డబ్ల్యూ.ఎస్., అటవీ, పర్యావరణ శాఖల్లో ఉన్న విజిలెన్స్, ఏసీబీ, శాఖాపరమైన కేసుల వివరాలు, అవి ఎంత కాలంగా పెండింగ్ లో ఉన్నాయి, అందుకుగల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబందిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు.

కొన్ని కేసులు 20 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న విషయం డిప్యూటీ సీఎం దృష్టికి వచ్చింది. ఈ విధంగా కేసులు అపరిష్కృతంగా ఉండటం మూలంగా అధికారులు, సిబ్బంది, ఉద్యోగ విరమణ తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేదు. సిబ్బంది తమ ఉద్యోగ కాల పరిమితిలో పదోన్నతుల్లోనూ వెనుకబడిన వారున్నారని గ్రహించారు.
ఈ క్రమంలో విజిలెన్స్ పెండింగ్ కేసులపై నివేదికను మూడు వారాల్లో ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అభియోగాలు వచ్చిన వారిపై విచారణ ప్రారంభించినపుడు దానికి తగిన పత్రాలు అందుబాటులో ఉండటం లేదనీ, ఇది విచారణ జాప్యానికి కారణం అవుతోందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ స్పందిస్తూ.. తన శాఖల పరిధిలో విజిలెన్స్ రిపోర్టుల ఆధారంగా తీసుకునే చర్యల్లో వేగం పెంచేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను సూచించారు.
ఏదైనా విషయంలో అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు వస్తే ప్రాథమిక విచారణ పకడ్భందీగా జరపాలన్నారు. ప్రాథమిక విచారణలోనూ బలమైన సాక్ష్యాలు సేకరించాలని, విచారణాధికారికి, ఆరోపణలు వచ్చిన ఉద్యోగికి మధ్య సన్నిహిత సంబంధాలు లేకుండా తొలి దశలోనే నిరోధించాలని స్పష్టం చేశారు. శాఖల్లోని అన్ని విజిలెన్స్, నాన్ విజిలెన్స్ కేసులను సరైన, సక్రమమైన రీతిలో తిరిగి విచారించి వేగంగా వాటిని పరిష్కరించేందుకు శాఖాధిపతులు దృష్టి సారించాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.












Click it and Unblock the Notifications