విజయవాడలో నేడు కరెంటోళ్ల సమరభేరి
విజయవాడ: విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ కోసం ఎపి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఐక్యవేదిక మంగళవారం విజయవాడలో కరెంటోళ్ల సమరభేరి పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది.
ముందుగా విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం అక్కడే బహిరంగ సభ జరుగుతుందని ఐక్యవేదిక సెక్రటరీ జనరల్ ఎం.బాలకాశి తెలిపారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా మోసం చేస్తూ వస్తోందని విమర్శించారు.

తెలంగాణా ప్రభుత్వం 22వేల మంది విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల్ని విలీనం చేసిందని తెలిపారు. కనీసం ఆ పద్ధతిలోనైనా ఎపి ప్రభుత్వం విలీనం చేయాలని కోరామన్నారు. కాంట్రాక్టు కార్మికుల డిమాండ్ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే కాంట్రాక్టు కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళన చేశాయని, అయితే ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. ప్రభుత్వవైఖరికి నిరసనగా వేలాదిమంది విద్యుత్ కాంట్రాక్టు కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 24 వేల మంది కాంట్రాక్టు కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేవి తమ ప్రధాన డిమాండ్ లని ఎపి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఐక్యవేదిక సెక్రటరీ జనరల్ ఎం.బాలకాశి తెలిపారు.












Click it and Unblock the Notifications