ఉద్యోగులపై యనమల, హోదాపై బిజెపి నేత సంచలనం, 'అమరావతిని గుర్తించట్లేదు'
అమరావతి: విజయవాడ వచ్చేందుకు ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం అన్నారు. అయితే విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నందున అందరూ ఒకేసారి రావటానికి ఇబ్బంది ఉంటుందని చెప్పారు.
రెయిన్ ట్రీ పార్కులో మంత్రులు, అధికారుల నివాసాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. నివాస సముదాయానికి ఉపసంఘం సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. దానిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు.

ఇతర ఉద్యోగులకు వసతి సదుపాయం అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఉద్యోగుల స్థానికత, కార్యాలయాల తరలింపుపై మంత్రి యనమల, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమై చర్చించారు. అనంతరం యనమల విలేకరులతో మాట్లాడారు.
స్థానికత అంశంపై సీఎంతో చర్చించామన్నారు. దానిపై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. త్వరలో హెచ్ఆర్ పైన నిర్ణయం తీసుకుంటామన్నారు. జూన్ నాటికి హెచ్ఓడీ కార్యాలయాల తరలింపు పూర్తి చేస్తామన్నారు.
రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. 4న ఢిల్లీలో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన పాల్గొంటారు. 5న బెంగళూరులో జరిగే సీఐఐ సదస్సులో పాల్గొని 6న తిరిగి ఢిల్లీ వెళతారు. 7న హైదరాబాద్కు చేరుకుంటారు.
ప్రత్యేక హోదాపై బిజెపి వార్నింగ్
ప్రత్యేక హోదా కోసం ఏపీలోని పలుచోట్ల విద్యార్థులు చేస్తున్న నిరసన, ధర్నాలపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ కిషోర్ సోమవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. హోదాపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే తమకు అభ్యంతరం లేదన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తే సహించేదిలేదన్నారు.
ఈ విషయంలో విపక్షాలు కూడా విద్యార్థులకు మద్దతు పలకడం విచారకరమన్నారు. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని, లేకపోతే మాకు మేమే రక్షణ కల్పించుకుంటామన్నారు. ప్రత్యేక హోదా ఏమీ తారకమంత్రం కాదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య కృషి చేస్తున్నారన్నారు.
'అమరావతిని గుర్తించడం లేదు'
రాయలసీమ అభివృద్ధిపై పాలకులు దృష్టి సారించడం లేదని ఆరోపిస్తూ మరో సంస్థ తెరపైకి వచ్చింది. రాయలసీమ అభివృద్ధి సమితి పేరిట... తిరుపతి వేదికగా ప్రకటన చేసింది. టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన అమరావతిని తాము నవ్యాంధ్ర రాజధానిగానే గుర్తించడం లేదన్నారు.
కేవలం 40 శాతం ఓట్లు సాధించిన టీడీపీకి రాజధాని సహా అన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. 1956లో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని నేటి పాలకులు మళ్లీ పునరావృతం చేస్తున్నారన్నారు. సర్కారు ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 4న తిరుపతిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు హాజరుకావాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications