సీఎం జగన్ జోక్యం చేసుకోవటం లేదు- ఉద్యోగుల ఆందోళన బాట : కార్యాచరణ ఖరారు..!!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు సిద్దం అవుతున్నారు. ఏపీలో కొంత కాలంగా పీఆర్సీ తో పాటుగా పెండింగ్ డిమాండ్ల సాధన కోసం గట్టిగానే మాట్లాడుతున్నారు. అక్టోబర్ నెలాఖరు నాటికే పీఆర్సీ పైన స్పష్టత ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, సాధ్యపడలేదు. ఇక, రెండు సార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసినా... ఆర్దిక పరమైన అంశాల పైన స్పష్టత లేదు. కనీసం పీఆర్సీ నివేదిక అయినా ఇవ్వండి అని కోరినా..అది దక్కలేదు. తాజాగా సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు మాత్రం వారంలోగా ప్రభుత్వం పీఆర్సీ పైన ఉద్యోగ సంఘాలతో సమావేశం కానుందని చెబుతున్నారు.
ఉద్యోగ సంఘాల అత్యవసర సమావేశం
ఇక, ఉద్యోగ సంఘాలు పీఆర్సీ పైన స్పష్టత ఇవ్వటానికి ఈ నెలాఖరు వరకు డెడ్ లైన్ విధించాయి. ఈ నెల 27వ తేదీ వరకు నిరీక్షిస్తామని చెప్పారు. కానీ, ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో..ఈ రోజు ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో 11వ పీఆర్సీ అమలు, సీసీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నిశితంగా చర్చించారు. అనంతరం ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు సమావేశ వివరాలను వెల్లడించారు. రూ.1600 కోట్ల చెల్లింపులపై చర్చించామని.. జేఏసీ తరపున సాయంత్రం కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
సాయంత్రం కార్యాచరణ ప్రకటన
94 ఉద్యోగ సంఘాలతో చర్చించి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి వేదికగా కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిసెంబర్ నుంచి దశల వారీ నిరసలకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం. ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టకుండా ఉద్యోగులను అవమానిస్తోందని ఆరోపించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ సంఘాలతో ఏ రోజైనా ఆర్థికమంత్రి చర్చించారా.. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు.
నిరసనలు..కార్యాచరణ ఖరారు
పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా పీఆర్సీ ప్రకటన చేస్తే ఒప్పుకోమని తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు 1600కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసారు. పేదల కోసం పని చేసే ఉద్యోగుల పట్ల మంత్రి కించపరిచేలా మాట్లాడతారా అంటూ అవేదన వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం చెల్లించిన డీఏలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ డీఏలను చెల్లించాలన్నారు.