ఏపీలో కోడి పందాల, జంతువులపై పందాల బ్యాన్ అమలుచెయ్యండి; డీజీపీకి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ లేఖ
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే కోడి పందాల జోరు అంతా ఇంతా కాదు. ప్రభుత్వం కోడిపందేలు నిర్వహించడం పై నిషేధం విధించినప్పటికీ వందలాది మైదానాలు కోడిపందాల నిర్వహణ కోసం సిద్ధమవుతాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలను నిర్వహించడం సాంప్రదాయాల్లో భాగమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో ప్రజలు భావిస్తారు. అయితే కోడిపందాల నిర్వహణ సందర్భంగా కోళ్ల ను దారుణంగా హింసించడాన్ని పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ అఫ్ యానిమల్స్ (పెటా) ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా పెటా ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర డీజీపీకి కోడి పందాలతో పాటుగా జంతువులపై పందాలను నిషేధించాలని లేఖ రాసింది.
కోడిపందాల నిషేధాన్ని అమలు చేయండన్నయానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా
పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా ఫిర్యాదు మేరకు దేశంలో కోడిపందాలపై నిషేధం ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో కోడిపందాల కోసం వందలాది మైదానాలలో కోడి పందాల నిర్వహణ కొనసాగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) జంతువుల, పక్షుల ప్రాణాలను కాపాడే ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మరియు నేరస్థులపై చర్యలు తీసుకోవాలని పందాల పేరుతో జంతువులను పక్షులను హింసించే చట్టవిరుద్ధమైన సంఘటనలను ఆపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)కి లేఖ రాశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుంటే తప్పు చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు
కోడి పందాలతో పాటు జంతు పోరాటాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను సమర్థవంతంగా పాటించకపోతే, తప్పు చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ డి సవాంగ్కు రాసిన లేఖలో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది.
జంతువులపై క్రూరత్వం ప్రదర్శిస్తే జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం (PCA) 1960 ప్రకారం శిక్షార్హులు అవుతారని పేర్కొంది. కోడి పందాలు, జంతువుల పందాలకు అనుమతి ఇవ్వడం లేదా అలాంటి కార్యక్రమాలను నిర్వహించడం కోర్టు ధిక్కరణతో సమానమని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది.
పందాల పేరుతో జంతువులకు, పక్షులకు ప్రాణహాని
కోడి పందాలలో కోళ్ల కాళ్లకు చాలా పదునైన కత్తులు అమర్చబడి ఉంటాయి. ఇవి మాంసం మరియు ఎముకలను చీల్చివేస్తాయి. కోళ్ళ ప్రాణాలు తీస్తాయని వాటితో పాటు కొన్నిసార్లు ఆ కత్తులు ప్రేక్షకులకు కూడా ప్రాణాంతకమైన గాయాలను కలిగిస్తాయి అని పెటా చీఫ్ అడ్వకసీ ఆఫీసర్ ఖుష్బూ గుప్తా చెప్పారు. సురక్షితమైన సమాజం కోసం ఈ జంతువులకు, పక్షులకు హాని తలపెట్టవద్దని పెటా ఇండియా పిలుపునిస్తోంది. జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించే వ్యక్తులు తరచుగా మానవ బాధితులుగా మారతారని పరిశోధనలు చెబుతున్నాయి.
ఏపీలో కోడి పందాలు, జంతువుల పందాలపై పెటా ఆందోళన
పెటా ఇండియా ప్రకారం, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మరియు విజయనగరంలోని కొన్ని ప్రాంతాలలో అక్రమ కోడిపందాల కోసం వేలకొద్దీ వేదికలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశం అని వెల్లడించింది. జంతువుల పోరాటాలను ప్రేరేపించడం మరియు నిర్వహించడం అనేది PCA చట్టం, 1960లోని 11(1) (m) (ii) మరియు (n) సెక్షన్ల ప్రకారం శిక్షార్హమైన నేరాలు అని పేర్కొంది.
పందెం కోసం పెంచే కోళ్ళకు అడుగడుగునా హింస.. ఆవేదన వ్యక్తం చేసిన పెటా
పోరాటాల కోసం పెంచబడిన పందెం కోళ్ళను తరచుగా ఇరుకైన బోనులలో ఉంచి, నిజమైన పందాలకు ముందు ప్రాక్టీస్ పోరాటాలలో హింసిస్తారని ఆ సమయంలో కూడా వాటి ప్రాణాలకు హాని కలగవచ్చని వారు పేర్కొన్నారు . ఈ సంఘటనలలో పందానికి దిగిన ఒక కోడి లేదా రెండు కోళ్ళు కూడా చనిపోవచ్చు లేదా ఇద్దరూ తరచుగా తీవ్రంగా గాయపడవచ్చు అని పెటా పేర్కొంది. జంతువులపై పందాలు కాసి హింసించే సమయంలో జూదం మరియు మద్యం సేవించడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని జంతువుల హక్కుల సంస్థ పెటా పేర్కొంది.