జగన్ కు షాక్: సరస్వతి సిమెంట్స్ భూములను స్వాధీనం చేసుకొన్న ఈడీ
గుంటూరు జిల్లాలో సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కొనుగోలు చేసిన 903 ఎకరాల భూమిని ఈడీ స్వాధీనం చేసుకొంది.
అమరావతి:అక్రమాస్తుల కేసులో ఆంద్రప్రదేశ్ విపక్ష నాయకుడు జగన్ కు షాక్ తగిలింది. గుంటూరు జిల్లాలో సరస్వతి సిమెంట్స్ పేరుతో కొనుగోలు చేసిన 903 ఎకరాలను ఈడీ స్వాధీనం చేసుకొంది.
గుంటూరు జిల్లాలో సరస్వతి సిమెంట్స్ పేరుతో కొనుగోలుచేసిన 903 ఎకరాల భూమిని ఇప్పటికే ఈడీ జప్తు చేసింది.అయితే ఈ భూములను ఈడీ స్వాధీనం చేసుకొంది.అడ్జుడికేటింగ్ అథారిటీ ఆమోదంతో ఈడీ ఈ నిర్ణయం తీసుకొంది.వీటి విలువ సుమారు రూ.318 కోట్లు .
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద స్వాధీనం చేసుకొన్న ఈ భూమి సర్వే నెంబర్ల వారీగా వివరిస్తూ ఈడీ అధికారులు ఒక ప్రకటన ఇచ్చారు.ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సిమెంట్ ఫ్యాక్టరీ కోసం జగన్ తన సతీమణి భారతి పేరుతో గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని చెన్నాయపాలెం పరిసర గ్రామాల్లో ఈ భూములు కొనుగోలు చేశారు.

ఈ భూముల పక్కనే ఉన్న రెండు వేల ఎకరాల అటవీ భూమిలో మైనింగ్ చేస్తామని ప్రకటించారు. అప్పట్లో ఎకరానికి లక్షన్నర నుండి మూడు లక్షలకు రైతులకు చెల్లించి కొనుగోలు చేశారు. 208..09 మధ్య కాలంలో ఈ లావాదేవీలు చోటుచేసుకొన్నాయి.
కొందరు రైతుల వారసులు సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామని హమీ ఇచ్చారు. ఫ్యాక్టరీ ప్రారంభించే వరకు సాగు చేసుకొంటామని, పనులు ప్రారంభమైన సమయంలో భూములను ఇస్తామని రైతులు కోరితే అంగీకరించలేదు.
2014 వరకు వేచి చూసి రైతులు ఈ భూముల్లో పంటలు వేశారు.అయితే స్థానిక ఎంఏల్ఏ రామకృష్ణారెడ్డి ఈ భూములను స్వాధీనం చేసుకొనేందుకు వస్తే రైతులు తిరగబడ్డారు.
ఈ భూములనే అక్రమాస్తుల కేసులో ఈడీ జప్తు చేసింది. ఇప్పుడు ఏకంగా వాటిని స్వాధీనం చేసుకొంటున్నట్టు ప్రకటించింది.భూముల క్రయ విక్రయాలపై నిషేధం ఉన్నందున, తాకట్టు పెట్టడం కుదరదు.
ఈ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని రైతుల తరపున పోరాడిన మాచవరం వాసి బ్రహ్మం చౌదరి కోరుతున్నారు. లేదా ప్రభుత్వమే సిమెంట్ ఫ్యాకర్టీ లేదా వేరే పరిశ్రమను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలివ్వాలని ఆయన కోరుతున్నారు.












Click it and Unblock the Notifications