సిఎంవి డ్రామాలే: ఎర్రబెల్లి, ఢిల్లీలోనే కూర్చోండి: అశోక్
హైదరాబాద్/వరంగల్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నాశనం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కుట్ర పన్నిందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఆయన మంగళవారం వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లుగా కిరణ్ కుమార్ రెడ్డి ఆడుతున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర సమితిని, మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తోందని అన్నారు. 2008లో కేంద్రానికి ఇచ్చిన లేఖను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెనక్కి తీసుకోలేదని తెలిపారు. చంద్రబాబును తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు, నాయకుడు హరీశ్ రావు తెలంగాణ వ్యతిరేకి అనడం సరికాదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
చేతగాకుంటే ఢిల్లీనే కూర్చొండి: అశోక్ బాబు
హైదరాబాద్: సీమాంధ్ర కేంద్రమంత్రుల చేతగాని తనంవల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకు పోతుందని ఏపిఎన్జివో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రులు చేతగాకుంటే ఢిల్లీలోనే కూర్చోవాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తామే పోరాడతామని అన్నారు. విభజనకు ఒప్పుకునే నేతలకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామని హెచ్చరించారు.
భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, జెడిఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడలను అపాయింట్ మెంట్ కోరినట్లు ఆయన తెలిపారు. నవంబర్ 24న జరిగే సమైక్య జెఏసి భేటీలో సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని అశోక్ బాబు చెప్పారు.
సోనియా దృష్టికి భద్రాచలం
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి బలరాం నాయక్ మంగళవారం ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా బంద్ విషయాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లినట్లు బలరాం నాయక్ తెలిపారు. భద్రాచలం డివిజన్ను తెలంగాణలోనే ఉంచాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఎంత ముఖ్యమో... భద్రాచలం కూడా తమకు అంతే ముఖ్యమని సోనియాకు వివరించినట్లు ఆయన చెప్పారు. రాయల తెలంగాణపై కేంద్రం, అధిష్టానందే నిర్ణయమని ఆయన అన్నారు.