బాబు మాట్లాడలేదేం, చస్తానని నటన: ఎర్రబెల్లి vs జోగు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన శాసన సభలో చర్చ జరుగుతున్న సమయంలో శుక్రవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు, తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు జోగు రామన్నల మధ్య అమరవీరుల అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది.
తెలంగాణ ఉద్యమంపై మాట్లాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంపై ఎందుకు గొంతు చించుకుంటున్నారని జోగు రామన్న ప్రశ్నించారు. తెలంగాణతోనే తమ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.
సమైక్య రాష్ట్రంలో అధిలాబాదు గిరిజనులకు ఎలాంటి మేలు జరగలేదని వాపోయారు. లోయర్ పెన్ గంగ ప్రాజెక్టును సీమాంధ్ర పాలకులు పట్టించుకోలేదన్నారు. సాగునీటిలో అదిలాబాద్ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. చంద్రబాబు తెలంగాణ ఉద్యమం గురించి ఎప్పుడు మాట్లాడకున్నా, కృత్రిమమైన సమైక్య ఉద్యమం గురించి మాట్లాడుతున్నారన్నారు.
తీవ్రంగా స్పందించిన ఎర్రబెల్లి
జోగు రామన్న వ్యాఖ్యల పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసింది తెరాసనే అని ఆరోపించారు. వెయ్యి మంది ఆత్మహత్యలకు కారణం కూడా ఆ పార్టీనే అన్నారు. శ్రీకాంత చారి వైద్యం ఖర్చు భరించింది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఓ తెరాస నేత చనిపోతానని నటన చేస్తే ఆ తర్వాత శ్రీకాంత చారి చనిపోయారన్నారు.