టీపై హరికృష్ణ మాట మార్చారు, ఎన్టీఆర్ ఉంటే..: ఎర్రబెల్లి
హైదరాబాద్: పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తీరును తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు తప్పు పట్టారు. ఆయన శనివారంనాడు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణపై నందమూరి హరికృష్ణ మాట మార్చారని ఆయన విమర్శించారు. తెలంగాణకు అనుకూలమని హరికృష్ణ తొలుత చెప్పారని, ఆ తర్వాత మాట మార్చారని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు ఉండి ఉంటే తెలంగాణ వచ్చి ఉండేదని హరికృష్ణ అన్నారని, తెలంగాణ వస్తే బాగుంటుందని కూడా అన్నారని ఆయన గుర్తు చేశారు.

ఎన్టీ రామారావు జీవించి ఉంటే తెలంగాణ వచ్చి ఉండేదని, అధికార వికేంద్రీకరణకు ఆద్యుడు ఎన్టీ రామారావు అని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల ప్రజల వద్దకు ప్రభుత్వం చేరుతుందని భావించి తెలంగాణపై ఎన్టీ రామారావు ఆలోచించి ఉండేవారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తాము సాధించుకుంటామని ఆయన అన్నారు.
తెలుగువారి ఘనత ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొనియాడారు. రాజకీయాలంటే ఏమిటో ఎన్టీఆర్ చేసి చూపారన్నారు. తెలుగు జాతి గుర్తించుకోదగిన వ్యక్తి ఎన్టీఆర్ అని బాబు తెలిపారు. ఆత్మగౌరవ పోరాటం చేసి తెలుగుజాతికి గుర్తింపు తెచ్చారని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ను కూకటివేళ్లతో పెకిలించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడిచి రాష్ట్రానికి, దేశానికి వన్నె తీసుకొచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ 18వ వర్థంతి సందర్భంగా చంద్రబాబు, సతీమణి భువనే శ్వరి, కుమారుడు లోకేష్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications