సిఎం జిల్లాలో ఆత్మహత్యలు: అసెంబ్లీలో ఎర్రబెల్లి Xహరీష్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గురువారం కెసిఆర్, హరీష్ రావు, టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావుల మధ్య వాగ్వాదం జరిగింది. గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ... సిఎం సొంత జిల్లాలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, నిబంధనలు లేకుండా మొత్తం రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విమర్శళు మాని ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు.
అమరవీరులను, ఓయు విద్యార్థులను తెరాస అవమానించిందన్నారు. ఓడిపోయే సత్తుపల్లిని ఓయు నేతకు ఇచ్చారన్నారు. తెరాసకు అమరవీరుల పైన ప్రేమ ఉంటే శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలన్నారు.
ఎర్రబెల్లి వ్యాఖ్యల పైన హరీష్ రావు స్పందించారు. శంకరమ్మ పైన పోటీ పెట్టనని మీరు ఎలా పెట్టారని ప్రశ్నించారు. అమరవీరుల కుటుంబాలకు తాము న్యాయం చేస్తామని చెప్పారు. రూ.10 లక్షళ రూపాయలు ఇస్తామని, వ్యవసాయ భూమిని ఇస్తామన్నారు.
సోనియాకు ధన్యవాదాలు తెలిపితే బాగుండేది: డికె అరుణ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారమయిందని... అలాంటి సోనియాకు శాసనసభలో ధన్యవాదాలు తెలిపితే హుందాగా ఉండేదని డికె అరుణ అన్నారు. తెరాస ప్రభుత్వం చేపట్టబోయే ప్రజా సంక్షేమ పథకాలకు సహకరిస్తామని తెలిపారు. అయితే, ప్రజలను ఇబ్బంది పెట్టే అంశాల్లో మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.
కాగా, అంతకుముందు తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆమెను ముఖ్యమంత్రి కెసిఆర్, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, గీతారెడ్డి, టిడిపి సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు అభినందించారు. అందరూ కలసి ఆమెను వెంటబెట్టుకుని వెళ్లి స్పీకర్ ఛైర్లో కూర్చోబెట్టారు.