ఇదీ ప్రగతి, విభజన కష్టాలు ఎదుర్కొంటూనే..: గవర్నర్, ప్రత్యేక ఆకర్షణగా దేవాన్ష్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. విజయవాడలోని ఇందిగాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర దిన వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు బాబు దూరం: కారణమిదే!, జెండా ఎగరేసిన గవర్నర్, భువనేశ్వరి హాజరు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ నర్సింహన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. విభజన కష్టాలను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు..
మెజార్టీ ప్రజలు సంతోషంగా..
తమ పాలనలో మెజార్టీ ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రజల్లో 80శాతం సంతృప్తి స్థాయికి చేరుకునేలా కృషి చేస్తోందన్నారు. చంద్రన్న మాల్స్ ద్వారా నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకే అందిస్తోందని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు.
కాపులకు రిజర్వేషన్లు..
‘10,720 కిలోమీటర్ల పొడవైన రహదారులను రూ.7,621కోట్లతో అభివృద్ధి చేస్తోంది. బీసీల్లో ఎఫ్ కేటగిరీ కింద కాపులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తోంది. ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిచేందుకు అసెంబ్లీ బిల్లు పాస్ చేశాం' అని గవర్నర్ వివరించారు.
పోలవరం పూర్తి చేస్తాం
‘గోదావరి-కృష్ణా నదులను పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి ఫలాలు సాధించగలిగాం. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం రూ.423కోట్లు ఖర్చు చేస్తోంది. సాంకేతికతను జోడించి ఉత్పాదకతను పెంచుతోంది. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ను రూ.3,806కోట్లతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీరందిస్తాం' అని గవర్నర్ నర్సింహన్ వివరించారు.
బాబు గైర్హాజరు.. ప్రత్యేక ఆకర్షణగా దేవాన్ష్
గణతంత్ర వేడుకల్లో పలువురు మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విమానం ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గణతంత్ర వేడుకలకు హాజరుకాలేకపోయారు.