సభను తప్పుదోవ పట్టించారు: కిరణ్ రెడ్డిపై ఈటెల ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రసంగంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే కర్నూలు వాళ్లు మహబూబ్నగర్ జిల్లాలోకి రావడానికి పాస్పోర్టు తీసుకోవాలా అని ఆయన అడిగారు. రాష్ట్రాలు విడిపోయినా భారత రాజ్యాంగమే అమలవుతుందనే విషయాన్ని గుర్తు చేసునకోవాలని ఆయన అన్నారు.
ఈటెల రాజేందర్ వ్యాఖ్యకు ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే పన్ను కట్టాల్సి వస్తుందా అనే అపోహలు ప్రజలు ఉన్నాయని, అది అపోహ మాత్రమేనని, ఆ విషయం చెప్పడానికే తాను కర్నూలు జిల్లాకు చెందిన మహిళ ఆలంపూర్లో పూలమ్మకునే విషయంపై వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని చెప్పానని ఆయన అన్నారు. అలా అనుకుంటున్నారని చెబుతున్నానని, అది తన అభిప్రాయం కాదని ఆయన అన్నారు.
రెండు రాష్ట్రాలు ఏర్పడినా ప్రజల ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని, రాష్ట్రాలుగా విడిపోయినా దేశం ఒక్కటేనని ఆయన అన్నారు. సార్వభౌమాధికారానికి లోబడే ఉంటాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి 371డి గురించి దారుణంగా మాట్లాడారని ఆయన అన్నారు. 371డి అమలైతే జిల్లా, జోనల్ మల్టీ జనల్ విధానాల్లో స్థానికేతరులంటే తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందినవారే గానీ దేశమంతటికీ చెందినవారు కాదని, అలా చూసినప్పుడు తెలంగాణలో ఉద్యోగాలు తెలంగాణ యువతకే దక్కుతాయని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి పదవి కోసం ఎలా లాబీలు చేసుకుంటారనే విషయం జోలికి తాను వెళ్లబోనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే విడిపోవడం లేదని, ఇంతకు ముందు చాలా రాష్ట్రాలు విడిపోయాయని ఆయన అన్నారు. విడిపోయిన తర్వాత గుజరాత్ అభివృద్ధి చెందలేదా, కొత్తగా ఏర్పడిన మూడు రాష్ట్రాలు అభివృద్ధి చెందడం లేదా అని ఆయన అడిగారు. చత్తీస్గడ్ వేగంగా అభివృద్ధి చెందుతోందనే విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. విడిపోతే తెలంగాణ ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అపారమైన అనుభవం ఉన్నవాళ్లు బిల్లును తయారు చేశారని, తప్పులుంటే వారు చూసుకుంటారని ఆయన అన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండి, నిర్ణయాన్ని అమలు చేస్తానని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి మాట తప్పుతున్నారని ఆయన అన్నారు.
రాజ్యాంగం ప్రకారమే బిల్లుపై చర్చ చేస్తున్నామని, కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని సిపిఐ శాసనసభా పక్ష నేత గుండా మల్లేష్ అన్నారు. ముఖ్యమంత్రి ఇంత పనికిమాలిన మాటలు మాట్లాడుతారని తాను అనుకోలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మాటలు తెలంగాణ ప్రజల గుండెలకు గాయం చేసిందని, సీమాంధ్ర ప్రజలకు మార్గదర్శకత్వం చేయలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిది బడ్జెట్ ప్రసంగంలా ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి భాష బాగుంది గానీ తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు.