అక్కడ గాలికొదిలి తెలంగాణలో కుట్రలు: ఈటెల, ఏపీలోను బాబుకు చుక్కలు
హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై, రేవంత్ రెడ్డి పైన తెలంగాణ మంత్రులు సోమవారం మండిపడ్డారు. వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్తో పాటు చంద్రబాబును కూడా విచారించాలని జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష పడుతుందన్నారు. ఆంధ్రా కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. డబ్బుతో ఏదైనా చేయవచ్చుననుకునే వారికి ఇదే గతి పడుతుందన్నారు.
చంద్రబాబు మారలేదని తెలుసుకున్నారు: ఈటెల
చంద్రబాబు ఇంకా మారలేదని ప్రజలు తెలుసుకున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. టీడీపీ బ్రోకర్ల పార్టీ అన్నారు. లంచం ఇవ్వజూపిన కేసులో ఆచరించింది రేవంత్ అయితే కుట్రపన్నింది బాబు అన్నారు. చంద్రబాబు పేరు రేవంత్ స్పష్టంగా చెప్పారన్నారు.
ప్రజాస్వామ్యానికి చంద్రబాబు మచ్చ తెచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాలికి వదిలి తెలంగాణలో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు.
రేవంత్ విషయంలో చట్టం తన పని తాను: దత్తాత్రేయ
రేవంత్ రెడ్డి విషయంలో చట్టం తన పని తాను చేసుకొని పోతుందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. మిత్రపక్షమైనా, విపక్షమైనా తప్పు తప్పే అన్నారు. మరోవైపు, తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపట్లో గవర్నర్ను కలవనున్నారు.
ఏపీలోను బాబుపై నిప్పులు
రేవంత్ వ్యవహారంలో చంద్రబాబుపై ఏపీలోను నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేయాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. చంద్రబాబు జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఏపీలో పాలన గాలికి వదిలి, అక్కడి ఆదాయంతో తెలంగాణలో కుట్రలు అంటూ ధ్వజమెత్తుతున్నారు.
రేవంత్ దొరికిన దొంగ: తమ్మినేని
రేవంత్ రెడ్డి దొరికిన దొంగ అని తమ్మినేని అన్నారు. ఎన్నికలు కమర్షియల్ అయ్యాయనడానికి నిన్నటి సంఘటనే ఉదాహరణ అన్నారు.